Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలో మొక్కజొన్న రైతులు
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 64 వేల ఎకరాల్లో సాగు
- నియంత్రిత సాగు పద్ధతిలో లేని పంట
- మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు
- క్వింటాల్కు రూ.2 వేలు ఇవ్వాలని వేడుకోలు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
మొక్కజొన్న రైతులకు కష్టాలు మొదలయ్యాయి. నియంత్రిత సాగు విధానం పేరుతో ప్రభుత్వం ఈసారి మొక్కజొన్న వేయొద్దని సూచించింది. కానీ, ప్రత్యేక పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్లో ఆ పంట సాగు చేసిన రైతులు నిండా మునుగుతున్నారు. మార్కెట్లో మక్కలకు ధర లేక ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో కొన్ని మండలాల్లో పంట కోతలు పూర్తయ్యాయి. కానీ, పంటను అమ్ముకునే దారి లేక రైతులు తల పట్టుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 64 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగయింది.
ఇక్కడ వరి, సోయా తరువాత అత్యధికంగా మొక్కజొన్న పంట సాగవుతుంది. ఈ యేడాది నిజామాబాద్లో 21,341 ఎకరాలు, కామారెడ్డిలో 43 వేల ఎకరాల్లో రైతులు పంట సాగు చేశారు. అయితే ఈ వానాకాలంలో సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం పేర మొక్కజొన్నను సాగు చేయొద్దని చెప్పింది. కానీ ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక పరిస్థితుల్లో రైతులు పంట సాగు చేశారు. నిజామాబాద్ ఆర్మూర్ డివిజన్లోని 11 మండలాల్లో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేస్తారు. బోధన్లో నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఈ పంట సాగు చేస్తారు. ఇక కామారెడ్డిలో సంప్రదాయబద్ధంగా ప్రతియేటా పెద్దఎత్తున మొక్కజొన్న సాగు చేస్తారు. నిజామాబాద్తో పోల్చితే రెండింతల పంట సాగవుతోంది. వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యత లేకపోవడం, నేలల స్వభావంతో సోయా తరువాత మొక్కజొన్న సాగు చేస్తున్నారు. పైగా పసుపులో అంతర పంటగా కూడా మొక్కజొన్న సాగు చేసుకోవచ్చని ప్రభుత్వం కొంత సడలింపులు ఇచ్చింది. అయితే ఆర్మూర్, జక్రాన్పల్లి, మోర్తాడ్ తదితర మండలాల్లో ఇప్పటికే పంట కోతలు పూర్తయ్యాయి. మిగిలిన మండలాల్లో పంట చేతికొచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదు.
మార్కెట్లో భారీగా పడిపోయిన ధరలు
మార్కెట్లో మక్కల ధరలు భారీగా పడిపోయాయి. సాధారణంగా ప్రభుత్వ మద్దతు ధర కంటే పౌల్ట్రీ యజమానులు రెండు నుంచి మూడు వందల ధర ఎక్కువ చెల్లించి మక్కలు కొనుగోలు చేస్తారు. కానీ, ఈ యేడాది సరిపడా నిల్వలు ఉండటంతో మార్కెట్లో డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం క్వింటాల్కు రూ.1200 నుంచి రూ.1300 మాత్రమే పలుకుతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. మార్కెట్ రేట్ ప్రకారం పంట అమ్మితే పెట్టుబడి ఖర్చులకే సరిపోతాయని, తమకు కూలీ రేట్లు కూడా పడదని వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.2 వేలతో పంట కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోలు కేంద్రాలకు నో..
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం ససేమిరా అంటోంది. సాధారణంగా ప్రతి యేడాదీ సొసైటీలు, ఐకేపీలతో పంట కొనుగోలు చేసేది. గతేడాది క్వింటాకు రూ.1760 మద్దతు ధరతో ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేసింది. కానీ, ఈ యేడాది నియంత్రిత సాగు విధానంలో మొక్కజొన్న సాగు చేయొద్దని సూచించినప్పటికీ.. సాగు చేశారనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. వద్దన్నా సాగు చేసారు.. అనుభవించండి అనే పద్ధతిలో వ్యవహరిస్తోంది. అందువల్లే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. ఇదే అదునుగా పౌల్ట్రీ యజమానులు, దళారులు రెచ్చిపోతున్నారు. తాము ఎంత చెబితే అంతకే రైతులు పంట అమ్ముతారనే నమ్మకంతో ఉన్నారు.
కొనుగోలుకు ఆదేశాలు రాలేదు :శ్యామ్- మార్క్ఫెడ్ చైర్మెన్
ఈ యేడాది మొక్కజొన్న కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలూ రాలేదు. గతేడాది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం పంట కొనుగోలు చేశాం. ఈ సారి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంది.
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి:బూత్పురం మహిపాల్- మోర్తాడ్
వర్షాకాలం సీజన్కు పసుపులో అంతర పంటగా మొక్కజొన్న సాగు చేశాం. అంతర పంటగా మొక్కజొన్న సాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. మొక్కజొన్న కోతకు వచ్చిన దశలో ఇప్పుడు మక్కలను కొనుగోలు చేయబోమని చెప్పడం సమంజసం కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటకు మద్దతు ధరగా క్వింటాల్కు రూ.1850 ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ఇవ్వాలి.