Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని జిల్లాల ఎస్పీలు, నగర సీపీలకు డీజీపీ ఆదేశాలు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలు, నగర సీపీలకు డీజీపీ నుంచి ఉత్తర్వులు జారీ అయినట్టు తెలిసింది. వచ్చే రెండు రోజుల పాటు ఉత్తర తెలంగాణ మొదలుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు చేయడంతో డీజీపీ తన తోటి ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా రెండు రోజుల క్రితం దీన్దయాళ్ నగర్లో ఒక బాలిక కాలువలో పడి దయనీయ స్థితిలో మరణించడం, ఆదివారం కురిసిన భారీ వర్షాల కారణంగా సరూర్నగర్ చెరువు సమీపంలో స్కూటీపై వెళ్తున్న ఒక యువకుడు గల్లంతు కావడం వంటి ఘటనలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, బస్తీలలో ఉన్న వారికి ఆపద ఏర్పడితే వెంటనే సహాయం అందించడానికి పోలీసులు కూడా మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. ముఖ్యంగా కాలువలు, చెరువులు, మత్తడి దూకుతున్న చెరువుల వద్ద ముందు జాగ్రత్త చర్యగా గస్తీని ఏ ర్పాటు చేయాలని కూడా డీజీపీ కోరినట్టు తెలిసింది.