Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పుడు సీజనల్ భయం
- ప్రతి వ్యాధికి కోవిడ్ టెస్టు ... ప్రయివేటు ఆస్పత్రుల ఆర్థిక అరాచకం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''అసలే కరోనా..... ఆపై ఇప్పుడు వానల మూలంగా సీజనల్ వ్యాధుల భయం. ఎదుటోడు తుమ్మినా, దగ్గినా పరేషాన్. దీన్ని అడ్డం పెట్టుకుని ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రులు నిరుపేదలను ఆటాడుకుంటున్నాయి. ఆ పై వైద్యం పేర జలగల్లా వ్యవహరిస్తున్నాయి.'' సాధారణ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడే పేదలు ఈసారి వాటికి తోడు కరోనాతోనూ కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్ని సీజనల్ వ్యాధులకు, కరోనా వచ్చిన వారికి వచ్చే లక్షణాలు ఒకేలా ఉండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇదే అదనుగా ప్రయివేటు ఆస్పత్రులు ప్రతి దానికి కోవిడ్ టెస్టు చేసుకోవాలని షరతు పెడుతూ ఆర్థికంగా దండుకుంటున్నాయి. మరి కొన్ని ఆస్పత్రులైతే కరోనా నిర్థారణ కాకముందే చికిత్స చేయాలంటూ పరుగులు పెట్టిస్తున్నారు. అందిన కాడికి దండుకుంటున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో సిబ్బంది కొరత, సౌకర్యాల లేమితో సేవలు సకాలంలో అందించలేని పరిస్థితి నెలకొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు ప్రయివేటుకు వెళ్లి బలవుతున్నారు. కోవిడ్-19, చలిజ్వరం, ఫ్లూ, సీజనల్ గా వచ్చే అలర్జీల్లో కొన్ని లక్షణాలు ఒకేలాగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. పొడిదగ్గు సీజనల్ అలర్జీల్లో అరుదుగా వస్తుందనీ, మిగిలిన వాటిలో సాధారణంగా ఉంటుందని అంటున్నారు. కరోనా సోకిన వారిలో మాత్రమే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతున్నది. చలిజ్వరం, సీజనల్ అలర్జీల్లో తుమ్ములు రావడం సహజం. కరోనా వైరస్ లో ముక్కు కారడం అరుదుగా ఉంటే, ఫ్లూ వచ్చిన వారికి కొన్ని సార్లు, మిగిలిన వారిలో సాధారణంగా కనిపించే లక్షణం. చలిజ్వరం ఉన్న వారిలో గొంతులో మంట సాధారణం కాగా మిగతా వారిలో అప్పుడప్పుడు వస్తుంటుంది. కొవిడ్, ఫ్లూ బారిన పడ్డ వారిలో జ్వరం సహజంగా కనిపించే గుణం. అదే విధంగా తొలనొప్పి, ఒళ్లు నొప్పులు, అతిసారం వంటివి ఆయా రోగాలను బట్టి సాధారణంగా, అరుదుగా, అసలు లేకపోవడం వంటివి ఉంటాయి.
ఆందోళన పడొద్దు : డాక్టర్ శ్రీకాంత్
ఏవైనా లక్షణాలు కనిపించగానే కరోనా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ ఫర్ సేవ సంస్థ ప్రతినిధి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. పొడిదగ్గు, తుమ్ములు, ముక్కు కారడం, గొంతులో మంట, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పి వంటి లక్షణాలు ఆయా వ్యాధిగ్రస్తుల్లో వేర్వేరు తీవ్రతతో ఉంటాయని చెప్పారు. ప్రతి లక్షణం కరోనాకు సంభందించిందనే భ్రమతో భయపడాల్సిన పని లేదని తెలిపారు. ఏదేనీ అనుమానం కలిగితే వెంటనే టెస్టు చేయించుకుంటే మంచిదని సూచించారు. ప్రారంభంలోనే పరీక్షలు చేయించుకుని తగిన చికిత్స చేయించుకుంటే మంచిదనీ, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లకుండా ఉంటారని అభిప్రాయపడ్డారు.