Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మావోయిస్టుల మృతి
నవతెలంగాణ-కాగజ్నగర్/ఆదిలాబాద్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఎదురుకాల్పులు జరిగాయి. శనివారం రాత్రి మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఒకరు ఛత్తీస్గఢ్కు చెందిన దళ సభ్యుడు చుక్కాలు, మరొకరు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జుగునాక బాదిరావుగా గుర్తించారు. జిల్లా ఇన్చార్జి ఎస్పీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారం పెరిగిందనే పక్కా సమాచారం మేరకు గత నాలుగు నెలలుగా పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉంటూ కూంబింగ్ చేపడుతున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, లోకల్ పోలీసుల ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 18 సాయంత్రం ఆసిఫాబాద్ మండలం చిలాటిగూడ పరిసర అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ దళాలకు మావోయిస్టులు తారసపడగా.. పోలీసులు కాల్పులు జరపకుండా వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా, తృటిలో తప్పించుకున్నారు. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, వారు కాల్పులు జరపడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. సుమారు గంట పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. భాస్కర్ దళం ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నదనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ వారు తప్పించుకునేందుకు వీలు లేదనీ, మహారాష్ట్ర పోలీసుల సహకారం కూడా తీసుకొని ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదీ తీరం వెంట కూంబింగ్ చేపడుతున్నట్టు వెల్లడించారు. సంఘటన స్థలాన్ని ఇన్చార్జి ఎస్పీతో పాటు మంచిర్యాల డీసీపీ ఉదరుకుమార్రెడ్డి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏఎస్పీ వైవీఎస్ సుధీంధ్ర, ఆసిఫాబాద్, కాగజ్నగర్ డీఎస్పీలు అచ్చేశ్వర్రావు, బీఎల్ఎన్ స్వామి, పలువురు సీఐలు, ఎస్ఐలు సందర్శించారు. మావోయిస్టుల కిట్ బ్యాగుల్లో పలువురు సానుభూతిపరుల పేర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ సమాచారంతో 15మంది మావోయిస్టు సానుభూతిపరులను ఆదిలాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
'ఇది బూటకపు ఎన్కౌంటర్' :మావోయిస్టు భాస్కర్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కడంబా అడవుల్లో శనివారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్ బూటకమని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల డివిజన్ కమిటీ ప్రకటించింది. కమిటీ కార్యదర్శి భాస్కర్ పేరుతో ఆదివారం సాయంత్రం లేఖ విడుదలైంది. ఆ లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. 'తెలంగాణలో పాశవిక అణచివేత కొనసాగుతోంది. ఇందుకు టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదు' అని పేర్కొన్నారు.