Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరుగు పేరిట భారీగా కోత
- ఆందోళన చేపట్టిన బాధిత రైతులు
నవతెలంగాణ-మల్హర్రావు
ఆరుగాలం కష్టపడి పడించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తమ ఖాతాల్లో జమకాలేదనీ, ఇదేంటని నిర్వాహకులని అడిగితే దాటేస్తుండటంతో బాధిత రైతులు ఆందోళనకు దిగారు. సుమారు 100మంది రైతులు పాల్గొన్న ఈ ఆందోళన భూపాలపల్లి జిల్లా తాడిచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలోని మల్హర్రావు మండలం రుద్రారంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధరకు ఆశపడి పండించిన వరి ధాన్యాన్ని తాడిచర్ల పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తే తరుగు పేరిట కోత విధించడం అన్యాయమన్నారు. కొనుగోలు కేంద్ర నిర్వాహకుడు, పీఏసీఎస్ సిబ్బంది, రైస్ మిల్లర్లు కుమ్మక్కై ఒక్కో రైతు వద్ద పది నుంచి యాభై బస్తాల ధాన్యం వరకు కోత పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. ట్రక్ షీట్ ప్రకారం ధాన్యం సొమ్ము చెల్లించాలనీ డిమాండ్ చేశారు.