Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజుల కోసం వేధిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోండి
- సర్వే రిపోర్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అందజేత
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆన్లైన్ చదువుల కష్టాలను తీర్చాలని భారత విద్యార్ధీ ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్.మూర్తి, టి.నాగరాజు ఆధ్వర్యంలో ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సర్వే రిపోర్టును అందజేశారు. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ పాఠాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకు అందుబాటులో లేవని తెలిపారు. అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం తదితర మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన తండాలు,ఆదీవాసీ గ్రామాల్లో నివసించే విద్యార్ధులకు ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఫోన్సిగళ్లతో పాటు కొన్ని ప్రాంతాల్లో టీవీలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఆన్లైన్ పాఠాలు విద్యార్థులకు అర్థకావడం లేదనీ, సందేహాలు ఎవరిని అడిగి తీర్చుకోవాలో తెలియని అయోమయ పరిస్థితి నెల కొందని తెలిపారు. మరో వైపు కార్పోరేట్ విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతుల ఫీజులు చెల్లించడంలో ఆలస్యమయితే లింక్ ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు పరీక్షలు కాకుండానే ఈ సెట్ పరీక్ష నిర్వహించడంతో మొత్తం మెమోలు లేక కౌన్సిలింగ్ సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ తరహాలో మద్యాహ్న బోజనం ఇంటివద్దకే అందించేలా చర్యలు తీసుకోవాలనీ, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 17 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రయివేటు వర్సిటీ బిల్లును వెనక్కి తీసుకోవాలని విన్నవించారు. విశ్వవిద్యాలయాల్లో గత ఎనిమిదేండ్లుగా ఖాళీగా ఉన్న 2,000 పైగా బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయడంతో పాటు వైస్ఛాన్స్లర్లను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పడాల శంకర్ పాల్గొన్నారు.