Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాచారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు భూముల పరిశీలన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి/యాచారం
ఫార్మాకు వ్యతిరేకంగా మహోద్యమాన్ని చేపడుతామని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కురుమిద్ద, తాడిపర్తి గ్రామాల్లో ఆదివారం జరిగిన ఫార్మా సిటీ భూ బాధిత రైతుల సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్కతో కలిసి పాల్గొన్నారు. గిరిజన తండాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. నాడు ఇందిరమ్మ పేదల కోసం భూములు కేటాయిస్తే.. నేడు కేసీఆర్ దళారీగా మారి ఆ భూములను కార్పొరేట్లకు పంచుతున్నారని విమర్శించారు. భూమికి, మనిషికి భావోద్వేగపూరిత బంధం ఉందనీ, దాన్ని లాక్కుంటే సహించేది లేదనీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందిరమ్మ ప్రభుత్వం పంపిణీ చేసిన 8వేల ఎకరాలు, రైతులకు చెందిన పట్టాభూములు 12వేల ఎకరాలు మొత్తం 20 వేల ఎకరాల వ్యవసాయ భూములను ఫార్మాసిటీకి ఎలా ధారాదత్తం చేస్తారని ప్రశ్నించారు. బాధితులకు అంతిమ పరిష్కారం చూపే వరకు కాంగ్రెస్ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకేట అన్వేష్రెడ్డి ఉన్నారు.