Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టభద్రుల నియోజకవర్గాలపై టీఆర్ఎస్ సమాలోచనలు
- గెలుపే లక్ష్యంగా పని చేయాలంటూ గులాబీ పెద్దల ఆదేశాలు
- ప్రతీ ఓటునూ రిజిస్టర్ చేయించుకోవాలంటూ సూచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
త్వరలో జరగనున్న పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎవరిని నిలబెట్టాలి.. ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై అధికార టీఆర్ఎస్లో చర్చోపచర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆశావహులు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసి డెంట్, రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయనకు అత్యంత సన్నిహితుడు, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ విషయంలో శరవేగంగా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి తనకు అవకాశ మివ్వాలంటూ ఆయన కేటీఆర్ను కోరినట్టు తెలిసింది. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళతా నంటూ మంత్రి.. రామ్మోహన్కు హామీనిచ్చినట్టు వినికిడి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినబడుతున్నది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ బరిలోకి దిగితే.. ఆయనకు ధీటుగా దేశపతిని నిలబెట్టాలంటూ నేతలు పార్టీ పెద్దలకు సూచన ప్రాయంగా తెలిపినట్టు సమాచారం. దీనిపై కేటీఆర్ కూడా కొంత సానుకూలత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంతకుముందు తటస్థులు, మేధావులను నిలబెట్టి, వారికి మద్దతివ్వాలని భావించారు. కానీ అందుకు భిన్నంగా ఇప్పుడు ఏకంగా పార్టీ తరఫున్నే అభ్యర్థులకు రంగంలోకి దించాలని నిర్ణయించినట్టు సమాచారం. 'మనం గతంలో పాతూరి సుధాకర్రెడ్డి, దేవీ ప్రసాదరావును పార్టీ తరఫున నిలబెట్టకుండా పొరపాటు చేశాం. దాని వల్ల నష్ట పోయాం. అందువల్ల ఈసారి కచ్చితంగా టీఆర్ఎస్ తరఫున్నే అభ్యర్థులను నిలబెట్టాలి...' అని తాజాగా నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం సీఎం కేసీఆరే తీసుకోనున్నారు.
మరోవైపు రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతీ పట్టభద్రుడు తన ఓటును రిజిస్టర్ చేయించు కోవాలంటూ కేటీఆర్ సూచించినట్టు తెలిసింది. 'పట్టభద్రుల నియోజకవర్గ ఓట్లకు సంబంధించి మనం నాన్ సీరియస్గా ఉంటున్నం... నేను, మా ఆవిడ, మా చెల్లి కూడా ఓట్లను రిజిస్టర్ చేయించుకోలేదు. ఈసారి మేం కచ్చితంగా రిజిస్టర్ చేయించుకుంటం. ఇదే మాదిరిగా మన కార్యకర్తల్లోని ప్రతీ పట్టభద్రుడూ తన ఓటును రిజిస్టర్ చేయించు కోవాలి. వారి ఓట్లన్నీ మనకే పడే విధంగా చర్యలు తీసుకోవాలి...' అని ఆదేశించినట్టు తెలిసింది.