Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలకు ముందు హడావుడి ఇప్పుడేమో గప్చుప్
- డీడీలు కట్టి 28 వేల మంది ఎదురుచూపులు
- నేడు ప్రగతి భవన్ ముట్టడి
- గొర్రెల, మేకల పెంపకందార్ల సంఘం పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
గొల్ల కురుమల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం కథ కంచికేనా? అనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. రెండేండ్లలో పథకాన్ని పూర్తి చేసే లక్ష్యంతో సర్కారు 2017 జూన్ 20న కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాకికి శ్రీకారం చుట్టి మూడేండ్లు దాటింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంతో హడావుడి చేసిన ప్రభుత్వం క్రమేణా ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రంలో సుమారు 29.5 లక్షల జనాభా ఉన్న గొల్లకురుమలు...ఈ వత్తిపై ఆధారపడి సుమారు 7.15 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. వారిని అన్ని విధాల ఆదుకొనే లక్ష్యంతో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించినప్పటికీ ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. ఆర్థికంగా అభివద్ధి చేసేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికీ 75 శాతం సబ్సిడీతో రెండేండ్లలో 7.29 లక్షల మందికి 1.53 కోట్ల గొర్రెల పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి సంవత్సరం లిస్టు 'ఎ' ద్వారా 3.64 లక్షల మందికి, రెండవ సంవత్సరం లిస్టు 'బి' ద్వారా మరో 3.65 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మూడేండ్లలో 3.66 లక్షల మందికి (మొత్తం లబ్ధిదారుల్లో సగం మందికి మాత్రమే) 76.86 లక్షల గొర్రెలను మాత్రమే పంపిణీ చేసి ఆర్ధాంతరంగా పథకాన్ని నిలిపివేశారు. ఇప్పటికీ దాని ఊసేత్తడం లేదు. నిధుల కొరత వల్లే గొర్రెల పంపిణీ ఆలస్యమవుతున్నదని అధికారులు చెబుతున్నారు. ఇటీవల పశువర్థక శాఖ మంత్రి హడావుడి ఉన్నతాధికా రులతో సమీక్ష సమావేశం నిర్వహించినా..అందులో జీవాల పెంపకందార్లకు అండగా ఉంటామని చెప్పడం మినహా గొర్రెల పంపిణీ అంశంపై మాట్లాడలేదు. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం క్రమక్రమంగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ఆలోచన కనపడుతున్నది. ఈ పథకాన్ని అమలు చేయడం కోసం జాతీయ సహకార అభివద్థి సమాఖ్య (ఎన్సీడీసీ) వద్ద రాష్ట్ర ప్రభుత్వం రూ.3.75వేల కోట్ల రుణం తీసుకుంది. ఈ పథకంలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తామనీ, ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తున్నదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలు దశలోనే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. అధికారులు, పాలకవర్గానికి చెందిన నాయకులు కుమ్మక్కై గొర్లను పంపిణీ చేసేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. గొర్రెలను రిసైక్లింగ్ చేశారనే ఆరోపణలు కరీంనగర్లో దుమారం రేపిన విషయమూ తెలిసిందే. ఇప్పటికీ గొర్రెలు వస్తాయనే ఆశతో లబ్ధిదారుని వాటా కింద సుమారు 28వేల మంది ఒక్కొక్కరు రూ 31,250 చొప్పున, రూ 87.5 కోట్లకు డీడీలు తీసి ప్రభుత్వ ఖజానాలో జమచేశారు. దాదాపు రెండేండ్లుగా గొర్రెల కోసం ఎదురు చూస్తున్నారు. రైతుల భూముల్లో 50 శాతం సబ్సిడీతో గడ్డి విత్తనాలు అందిస్తామనీ, గ్రామీణాభివద్ది శాఖ సాయంతో నీటితొట్లు, షెడ్లు కట్టిస్తామని చెప్పినా ఆచరణలో అది ఆమలు కాలేదు. నియోజక వర్గానికో సంచార పశువైద్యశాల వాహనం ఏర్పాటు చేసినప్పటికీ వీటిపని నామమాత్రంగానే ఉంది. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గొర్రెల, మేకల పెంపకం దార్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. విజయవంతం చేయాలని ఆయన గొర్ల కాపర్లను కోరారు.