Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రోత్సాహం లేక రైతుల అనాసక్తి..
- అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు
- తగ్గిన దిగుబడి... పెరిగిన దిగుమతి
- 11.04 టన్నుల కొరత
- ఆకాశాన్నంటిన ధరలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈ ఏడాది వానాకాలం సీజన్లో కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. రైతులకు ప్రోత్సాహం లేకపోవడంతో ఆసక్తిచూపడం లేదు. దీనికితోడు ఈసారి అకాల వర్షాలు పడటంతో అన్ని రకాలపంటలు బాగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కూరగాయల పంటలు కాస్తా ఎక్కువ వర్షం పడితే తీగ మురిగిపోతుంది. వారం రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో జనాభాకు అనుగుణంగా కూరగాయల సాగు జరగడం లేదు. ఈ పంటలు ఆరు మాసాలలోపే చేతికొస్తాయి. ఆ తర్వాత దానిని తొలగించి వేరే పంట వేసుకోవాల్సివస్తున్నది. అయినా ప్రభుత్వం ప్రోత్సాహం కరువై...ఎప్పుడు వేసే రైతులు కూడా ఈసారి వేయలేదు. ఈ పంటకు మద్దతు ధర లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలకే మొగ్గు చూపుతున్నారు. ఈసారి వానలు కురవడంతో వరి, పత్తి పంట వైపే రైతులు దృష్టి పెట్టారు. ఫలితంగా వ్యవసాయ పంటల సాగు కోటి 40 లక్షల ఎకరాలు దాటినట్టు వ్యవ సాయ శాఖ అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఉద్యాన పంటల సాగు కనీసం 8.9 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అందులో కూరగాయల సాగు కేవలం 90వేల ఎకరాల్లో జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూరగాయల సాగు లక్ష్యం 4.98 లక్షల ఎకరాలు. అందులో సగం కూడా జరగలేదు. కేవలం 90వేల ఎకరాల్లోనే వేశారు. దీనికి తోడు ఈ ఏడాది లక్ష్యంలో 18శాతమే కూరగాయలు వేయడంతో కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గి తీవ్రమైన కొరత ఏర్పడింది. ఇది మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు.
రైతుకు కూర'గాయాలే'...
రాష్ట్రంలో కూరగాయల రైతుకు అన్ని కష్టాలే. పండిన పంటకు ధర వస్తుందో, రాదో కూడా తెలియని పరిస్థితి. కష్టపడి పండించిన ఆ పంటకు మార్కెట్లో డిమాండ్ ఉంటుందో, లేదోననే అనుమా నాలు రైతులను పీడిస్తున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేక రైతులు గుడ్డెద్దు చేలో పడినట్టుగా సాగు చేస్తూనే ఉన్నారు. కూరగాయలకు నేలలు అనుకూలంగా ఉన్నా విత్తనాలకు సబ్సిడీ ఇవ్వక పోవడం, డ్రిప్ ఇరిగేషన్ కల్పించకపోవడం, కచ్చితమైన మద్దతు ధర లేకపోవడం, పండిన పంట ఒకటి,రెండు రోజుల్లో అమ్మకపోతే ఆ పంట పెంటపాలయ్యే పరిస్థితులు ఉండటంతో సమస్యలు ఉత్పమన్నవుతున్నాయి. దాన్ని దాచుకోవడానికి కోల్ట్స్టోరేజీలు అందుబాటులో లేవు. ప్రయివేటులో ఉన్నా అధిక ధరలు చెల్లించాల్సి వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం సీఏసీపీ ద్వారా అన్నిటికి ధరలు నిర్ణయిస్తున్నా కూరగాయలను పట్టించుకో వడం లేదు. ఏ రోజుకారోజు మార్కెంటిగ్శాఖ ధరలు నిర్ణయిస్తున్నా వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంటుంది. దీంతో పండించిన రైతులకంటే దళారులే అధికంగా లాభాలు గడిస్తున్నారు.
సీజన్ల వారిగా టమాటా పంటకు మద్దతు ధర ఇంత ఇస్తామనే భరోసా లేక ఇబ్బందులు పడుతున్నట్టు రైతులు అంటున్నారు. దీంతోనే మద్దతు ధర ఉన్న వ్యవసాయ పంటలు వేస్తున్నట్టు అంటున్నారు. కూరగాయల పంటల్లో సాంకేతికత వినియోగం, మార్కెటింగ్ మెలకువలపై అవగాహన కల్పించడం, మార్కెట్ లింకేజీ కల్పిస్తే ఎక్కువ పంట పండించే అవకాశం ఉంటుందని ఉద్యానవన నిపుణులు అంటున్నారు.
రంగారెడ్డి జిల్లాల్లోనూ తగ్గిన సాగు
రంగారెడ్డి జిల్లాలో లే అవుట్ల మూలంగా పట్టణీ కరణ పెరగడంతో సాగు భూములు లేకుండాపోతు న్నాయి. దీని ప్రభావంతో కూరగాయల సాగు గణనీ యంగా తగ్గింది. మహేశ్వరం, వికారాబాద్, సంగా రెడ్డి, మెదక్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో కూరగాయల సాగు జరిగేది. వర్షపాతం ఎక్కువగా ఉండడంతో ఈ సారి కూరగాయలపై ఆ ప్రభావం పడింది. గతేడాది రంగారెడ్డి జిల్లాలో 72వేల ఎకరాలు సాగు చేస్తే ఈసారి 45వేల ఎకరాలకు పడిపోయింది. వికారాబాద్లో 10వేల ఎకరాల సాగు తగ్గింది. సూర్యాపేటలోనూ అదే పరిస్థితి.
11.04 లక్షల టన్నుల కొరత
రాష్ట్రంలోని 4కోట్ల జనాభాకు ఏడాదికి 41.75 లక్షల టన్నుల కూరగాయలు అవసరమని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ప్రతి రోజూ ఆహారంలో 325గ్రాముల కూరగాయలు తీసుకోవాలని నిపుణు లు అంటున్నారు. ఏడాదికి 30.71 లక్షల టన్నుల కూరగాయలు మాత్రమే దిగుబడి వస్తున్నది. ప్రతి యేటా 11.04 టన్నుల కూరగాయల కొరత రాష్ట్రా న్ని వెంటాడుతున్నది. ప్రస్తుతం సాగు విస్తీర్ణం మరిం త తగ్గిపోవడంతో కొరత పెరిగింది. సాగుపడిపో వడంతో దీంతో ధరల భారం వినియోగదారులపై పడుతున్నది.