Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 62కు పెరిగిన కరోనా ఆస్పత్రులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎట్టకేలకు కరోనా చికిత్స కోసం వచ్చే పేద ప్రజలకు ఉపశమనం కలిగించేలా వైద్యారోగ్యశాఖ సేవలను విస్తరించింది. మంగళవారం నుంచి అన్ని జిల్లాల్లోకోవిడ్-19 చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రులను అందుబాటులోకి తెచ్చింది. 30 జిల్లాల్లో 45 ఆస్పత్రులకు పరిమితమైన సేవలను మరో మూడు జిల్లాల్లో ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా 17 ఆస్పత్రుల్లో బెడ్లను కేటాయించడంతో ఆస్పత్రుల సంఖ్య 62కు చేరింది. దీంతో పడకలు 8093 నుంచి 8821కి పెరిగినట్టు మంగళవారం ఉదయం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ వెల్లడించింది.
2166 మందికి పాజిటివ్.....
ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో రాష్ట్రంలో 2166 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 10 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు 1052 మంది కోవిడ్-19 బారిన పడి మరణించారు. మొత్తం 1,74,774 మంది వైరస్ బారిన పడగా ఇప్పటికే 1,44,073 మంది కోలుకున్నారు. మిగతా 29,649 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా 53,690 మందిని పరీక్షించగా వారిలో 4.03 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. మరో 1528 మంది ఫలితాలు రావాల్సి ఉన్నవి. ఇప్పటివరకు ప్రతి 10 లక్షల మందికి కేవలం 69,304 మందికి మాత్రమే పరీక్షలు చేయగలిగారు.
ఐదు జిల్లాల్లో వందకుపైగా......
రాష్ట్రంలో ఐదు జిల్లాల్లో వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 309 ఉన్నాయి. రంగారెడ్డి 166, మేడ్చల్-మల్కాజిగిరి 147, కరీంనగర్ 127, నల్లగొండ 113 కేసులొచ్చాయి. అతి తక్కువగా నారాయణపేట్ 11, కొమురంభీం ఆసిఫాబాద్ 19, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 20 కేసులను గుర్తించారు.