Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న పేట్ లబురుజులోని ప్రసూతి ఆస్పత్రి, విద్యుత్ సబ్ స్టేషన్లకు కేవలం రెండు మీటర్ల దూరంలో... పెట్రోల్ బంక్ ఉండటం క్షేమదాయకం కాదని రాష్ట్ర హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బంకును వీలైనంత త్వరగా వేరే ప్రాంతానికి తరలించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఏడాది చివరి నాటికి దాన్ని తరలిస్తామంటూ ప్రభుత్వం వివరణివ్వగా, అప్పటి వరకూ ఆగొద్దంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్రోహశక్తులు ఏదైనా దారుణానికి పాల్పడి.. ప్రాణనష్టం సంభవిస్తే, అప్పుడు చింతించే పరిస్థితులు రాకూడదని హితవు పలికింది. పెట్రోల్ బంకును తొలగించాలంటూ హైదరాబాద్ వాసి మొయినుద్దీన్ ఖాన్ రెండేండ్ల క్రితం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బంకును తొలగిస్తామంటూ గత ఏడాది ఇచ్చిన హామీ అమలు కాలేదంటూ ఆయన దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
ఆస్పత్రి, విద్యుత్ సబ్స్టేషన్లకు రెండు మీటర్ల లోపే పెట్రోల్ బంక్ ఉందనీ, 132/33 కేవీ, 11/32 కేవీ సబ్ స్టేషన్లల్లో విద్యుత్ సరఫరా, ఇతర కారణాల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్డోర్లో ఉండే సబ్ స్టేషన్ కాబట్టి ప్రమాదానికి ఆస్కారమే లేదని ప్రభుత్వం వివరణిచ్చింది. అయినప్పటికీ ఈ ఏడాది చివరి నాటికి పెట్రోల్ బంకును తరలిస్తామని కోర్టుకు తెలిపింది. అనంతరం న్యాయస్థానం విచారణను అక్టోబరు ఐదుకు వాయిదా వేసింది.
కేబీఆర్ పార్కును ఎందుకు తెరవట్లేదు...?
కరోనా లాక్డౌన్-4 నిబంధనల సడలింపు తర్వాత కూడా హైదరాబాద్ నగరంలోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కును ఎందుకు తెరవటం లేదంటూ రాష్ట్ర హైకోర్టు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా కరోనా నిబంధనల్ని అమలు చేస్తూ... పార్కులు తెరిస్తే లాభమే ఉంటుంది తప్ప నష్టం లేదంటూ అభిప్రాయపడింది. అయినప్పటికీ పార్కు తెరవటానికి ఉన్న అడ్డంకులు, సమస్యలు, తెరిస్తే తీసుకునే జాగ్రత్తలను వివరించాలని కోరింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించారు.
కేబీఆర్ పార్కుతోపాటు ఇతర పార్కులను కూడా తెరిచేందుకు సర్కారు సుముఖంగానే ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ సందర్భంగా వివరణిచ్చారు. అనుమతి కోసం కేంద్రానికి ఉత్తరం రాశామని ఆయన తెలిపారు. అక్కడి నుంచి ప్రత్యుత్తరం రాగానే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేబీఆర్ పార్కును తెరవాలని కోరుతూ బంజారాహిల్స్కు చెందిన వైద్యుడు జయంత్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఆయన తరఫు లాయర్ వాదిస్తూ... అత్యంత విశాలమైన పార్కులో అనేక ఔషద గుణాలున్న చెట్లు ఉన్నాయని తెలిపారు. పార్కును తెరిస్తే ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందని వివరించారు.
అందువల్ల దాన్ని తెరిచే విధంగా ఉత్తర్వులివ్వాలని కోర్టును అభ్యర్థించారు. పార్కులు తెరిచేందుకు ఎలాంటి ఆంక్షల్లేవనీ, అన్లాక్ నిబంధనలు-4లో ఈ విషయాన్ని పేర్కొన్నారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే యోగా, జిమ్నాస్టిక్స్ సెంటర్లనే కాకుండా బస్సులు, మెట్రో రైళ్లను కూడా నడిపేందుకు అనుమతించిందని వివరించారు. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు... ప్రభుత్వం తగిన వివరణిచ్చిన తర్వాత ఉత్తర్వులు జారీ చేస్తామంటూ తెలిపింది. కేసు విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.