Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్, వ్యకాస రాష్ట్ర కార్యదర్శులు స్కైలాబ్బాబు, ఆర్.వెంకట్రాములు
నవతెలంగాణ - దామరగిద్ద
రైతువేదికలు, శ్మశాన వాటికల నిర్మాణాల కోసం దళితుల భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని కేవీపీఎస్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు స్కైలాబ్బాబు, ఆర్.వెంకట్రాములు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్ నాయక్తో కలిసి మంగళవారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని గడిమునకనపల్లిలో దళితుల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వే నెంబర్ 254లో గల 35 గుంటల భూమిలోని పైర్లను రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో దౌర్జన్యంగా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దార్ పక్షపాత వైఖరితో దళితుల భూములను లాక్కోవాలని చూస్తున్నారని, ఇలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తహసీల్దార్, ఎస్ఐలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఎన్నికల ముందు మూడెకరాల భూమిని ఇస్తామని వాగ్దానం చేసి గద్దె ఎక్కిన తర్వాత దళితుల ఉన్న భూమినే లాక్కునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. దళితులు శ్మశాన వాటికలు ఇవ్వాలని కోరితే వారి భూములకే ఎసరు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వ అవసరాల కోసం, ప్రజల కోసం భూములను కొనుగోలు చేయాలని, అలా కాకుండా దళితుల భూములు లాక్కోవాలని చూస్తే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఉడుముల గిద్ద గోపాల్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజయ్య, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి హనుమంతు, సీఐటీయూ జిల్లా నాయకులు జోషి తదితరులున్నారు.