Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏకపక్షంగా ఆర్టిజన్స్ సర్వీస్రూల్స్
- ప్రత్యేక సెలవుల్లేవ్...గ్రాట్యుటీ లేదు
- ఒకే సంస్థలో వేర్వేరు చట్టాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రాష్ట్రంలో విద్యుత్ సంస్థలన్నీ వేర్వేరుగా ఉన్నా, ఒకే గొడుగు కింద సమన్వయంతో పనిచేస్తుంటాయి. వాటన్నింటికీ 2003 విద్యుత్ చట్టమే వర్తిస్తుంది. కానీ...పని స్వభావం ఒకటే అయినా, ఉద్యోగుల స్థాయిని బట్టి విద్యుత్ సంస్థల్లో చట్టాలు మారుతున్నాయి. ఒకే కంపెనీలో రెండు రకాల చట్టాల్ని అమలు చేస్తున్నారు. సంస్థలోని పర్మినెంట్ ఉద్యోగులకు ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ఉంటే, ఆర్టిజన్స్కు మాత్రం 1946 నాటి ఫ్యాక్టరీ యాక్ట్ను వర్తింప చేస్తున్నారు. విద్యుత్ సంస్థల్లో 23,600 మంది ఆర్టిజన్లు ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో వీరందరి సర్వీసుల్ని రెగ్యులరైజ్ చేస్తామని అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. అనేక పోరాటాలు, పరిణామాల అనంతరం వారిని నేరుగా రెగ్యులరైజ్ చేయలేమనీ, ఆర్టిజన్లుగా గుర్తిస్తూ, విద్యుత్ సంస్థల్లో విలీనం చేసుకొని, ప్రత్యేక చట్టాన్ని తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకే సంస్థలో రెండు రకాల చట్టాలు ఏంటని అప్పట్లోనే విద్యుత్ కార్మిక సంఘాలు ప్రశ్నించాయి. సాంకేతిక, న్యాయపరమైన కారణాల్ని యాజమాన్యాలు సాకుగా చూపాయి. ఆర్టిజన్ల చట్టంలో విధివిధానాల రూపకల్పన కోసం 23 కార్మిక సంఘాలతో కూడిన టీ-టఫ్ అనేక ఐక్య పోరాటాలు నిర్వహించింది. ఫలితంగా 2019లో డ్రాఫ్ట్ విధివిధానాలకు రూపకల్పన చేసి, అభ్యంతరాలను చెప్పమని యాజమాన్యాలు కార్మిక సంఘాలను కోరాయి. టీ-టఫ్ నేతలు డ్రాఫ్ట్పై తమ అభ్యంతరాలు, సూచనలను యాజమాన్యానికి అందచేశారు. మరో సమావేశంలో తుది నిర్ణయం తీసుకుందామంటూ లేబర్ కమిషనర్ మధ్యవర్తిత్వంలో యాజమాన్యం పేర్కొంది. ఆ తర్వాత కోవిడ్-19 లాక్డౌన్ వచ్చింది. 2020 జులై 16న లేబర్ కమిషనర్ జాయింట్ మీటింగ్కు టీ-టఫ్ను ఆహ్వానించి, స్టాండింగ్ ఆర్డర్కు ఆమోదం తెలుపమని కోరడంతో కార్మిక సంఘాల నేతలు ఆశ్చర్యపోయారు. డ్రాఫ్ట్పై తాము లేవనెత్తిన అభ్యంతరాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించాడాన్ని తప్పుపట్టారు. యాజమాన్యం మరోసారి కార్మికసంఘాలతో చర్చించి, తుది నిర్ణయం తీసుకుని రావాలని లేబర్ కమిషనర్ విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు తెలిపారు. అలాంటి చర్చలు ఏమీ లేకుండానే ఆగస్టు 18న స్టాండింగ్ ఆర్డర్స్ను ఏకపక్షంగా ఆమోదించుకున్నారు. దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి.
ఇవీ నష్టాలు...
1946 ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం వేతనంతో కూడిన సెలవులు (ఈఎల్) మాత్రమే వర్తిస్తాయి. అనేక ఇతర సౌకర్యాలను ఆర్టిజన్స్ నష్టపోతున్నారు. ఉద్యోగులకు తమ సర్వీసు కాలంలో 300 ఈఎల్స్, 120 ఫుల్ పే సెలవులు, 15 సీఎల్లు, ఆఫ్ పే, 300 మెడికల్ సెలవులు, ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్తే వర్తించే సెలవులు సహా పలు సౌకర్యాలు ఉంటాయి. ఇవి ఏవీ ఆర్టిజన్లకు వర్తించవు.
ఇప్పట్లో గ్రాట్యుటీ లేదు...
గ్రాట్యుటీ చట్టం ప్రకారం ప్రభుత్వ శాఖలో ఏ విభాగంలో అయినా కార్మికుడు చేరిన మొదటి రోజు నుంచి లెక్కించి, ఐదేండ్లు పూర్తయ్యాక వర్తింప చేస్తారు. కానీ విద్యుత్ సంస్థల్లో 2018 నుంచి ఆర్టిజన్ కార్మికులను గుర్తించినందున, అప్పటి నుంచే గ్రాట్యుటీ చట్టాన్ని వర్తింపచేస్తామని యాజమాన్యాలు స్టాండింగ్ ఆర్డర్స్లో పేర్కొన్నాయి. దీన్ని కూడా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. యాజమాన్య నిర్ణయం ప్రకారం 2023 వరకు ఏ ఒక్క కార్మికుడికి గ్రాట్యూటీ వర్తించదు. ఈలోపు రిటైర్ అయ్యేవారు, మరణించిన వారు ఆర్థికంగా నష్టపోతారు.
'కారుణ్యం' లేదు...
కారుణ్య నియామ కాల్లోనూ అనేక ఆంక్షలు విధించారు. ప్రమాదవశాత్తూ ఆర్టిజన్ కార్మికుడు మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తారు. కారుణ్య నియామకం ద్వారా కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తారు. ఈ మేరకు 2016 డిసెంబర్ 24 నాటి టీఎస్ ట్రాన్స్కో ఆఫీస్ ఉత్తర్వుల్లో ఉంది. కార్మిక సంఘాలతో ఒప్పందం కూడా జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మరణించిన కార్మికుడి కుటుంబానికి చెల్లించిన రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను తిరిగి యాజమాన్యానికి చెల్లిస్తేనే, కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇస్తామని తేల్చి చెప్తున్నారు. కనీసం కారుణ్య నియామక దరఖాస్తులను కూడా స్వీకరించట్లేదు. అధికారుల ఒత్తిళ్ల మేరకు మెదక్లో ఓ ఆర్టిజన్ కార్మికుడి కుటుంబసభ్యులు ఎక్స్గ్రేషియా తిరిగి చెల్లించినా, ఇప్పటి వరకు నియామకం చేయలేదు.
విద్యుత్ సంస్థల్లో ఇప్పటి వరకు విధి నిర్వహణలో మరణించిన ఒక్క ఆర్టిజన్ కార్మికుడి కుటుంబానికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. నిత్యం ప్రమాదాల మధ్య విధులు నిర్వహించే ఆర్టిజన్ల పట్ల యాజమాన్యాల చర్యల్ని కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. స్టాండింగ్ ఆర్డర్స్లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
పోరాటమే మార్గం
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు భిన్నంగా ఇప్పుడు ఆర్టిజన్ల పేరుతో ప్రత్యేక చట్టాన్ని తెచ్చి, హక్కుల్ని కాలరాస్తున్నారు. ఒకే సంస్థలో రెండు రకాల చట్టాలు ఎలా అమలు చేస్తారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఐక్య పోరాటాలే కోర్కెల సాధనకు మార్గం. దానిలో భాగంగానే కార్మికశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించి, ఆర్టిజన్స్కు న్యాయం చేయాలి.
- వి గోవర్థన్, ప్రధాన కార్యదర్శి తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్