Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో/యంత్రాంగం
ఆశాలను సీఎం కేసీఆర్ చులకనగా చూస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగా ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ (ఆశా) ఆధ్వర్యంలో కోఠిలోని వైద్య, ఆరోగ్యశాఖ కమిషనరేట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజూ ఆశాల సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండే మొదటి డాక్టర్ ఆశాలే అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరిది ప్రత్యేక పాత్ర అని, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కరోనా రోగులకు సేవలందిస్తున్న వారు అత్యంత దయనీయ స్థితిలో పని చేస్తున్నారని తెలిపారు. ఆశాలకు యూనిఫాం డబ్బులివ్వకపోతే దసరాకు అందరూ ఒక్కో రూపాయి చందా వేసుకుని కేసీఆర్ కుటుంబానికి బట్టలు కొనిద్దామన్నారు. కేసీఆర్ మోసపూరితంగా వ్యవహరించడం వల్లే నేడు నిరసనకు దిగాల్సి వచ్చిందన్నారు. ఆశాల డిమాండ్లు పరిష్కారం చేయలేనివి కావనీ, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 28, 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపడుతామని హెచ్చరించారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని వైద్యాశాఖాధికారి కార్యాల యం ఎదుట జరిగిన ధర్నాలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సునీత పాల్గొని మాట్లాడారు. నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రం ఎదుట నిరసన తెలిపారు. కల్వకుర్తి మండల కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. జోగిపేట మండల కేంద్రంలోని తహసీల్ ఎదుట ప్లకార్డులు పట్టుకొని నిరసన చేపట్టారు.
ఖమ్మం జిల్లా ధర్నా చౌక్లో ఆశా వర్కర్లు నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఏన్కూర్లో వైద్యాధికారికి వినతిపత్రం అందజేశారు. ముదిగొండ, వైరా, మధిర పీహెచ్సీల ఎదుట నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాలలో తహసీల్ ఎదుట నిరాహార దీక్ష చేసి తహసీల్దార్ శారదకు వినతిపతం ఇచ్చారు. దుమ్ముగూడెంలో సీనియర్ అసిస్టెంట్కు వినతి అందజేశారు.
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్లో రిలే దీక్షలు చేపట్టారు. ఆసిఫాబాద్ జిల్లా అడ పీహెచ్సీ వైద్యాధికారికి వినతిపత్రం ఇచ్చారు. ములుగు జిల్లా మంగపేటలో తహసీల్ ఎదుట రెండు గంటల పాటు బైటాయించి నిరసన తెలిపారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు.
రంగారెడ్డి జిల్లా కందుకూర్లో పీహెచ్సీ అధికారికి వినతిపత్రం అందజేశారు. యాచారం, షాద్నగర్ల్లో నిరసన చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నిరసన తెలిపారు. కుల్కచర్ల మండలంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి వినతిపత్రం అందజేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఎడపల్లి, వర్ని, రెంజల్, కోటగిరి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. భిక్కనూర్ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.