Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సమస్యల పరిష్కారం కోసం టీయుఎంహెచ్ఇయూ ఆధ్వర్యంలో వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు ధర్నా నిర్వహిం చారు. ఈ క్రమంలో ఉదయం ఉద్యోగులు భారీగా కోఠి లోని కమీషనర్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు రాగా పోలీసులు వారిని ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో ఉద్యోగులు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రెండు గంటల సేపు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టు ఉద్యోగులందరిని పర్మినెంట్ చేయాలనీ, కరోనా విధులు నిర్వహిస్తున్న వారికి స్పెషల్ ఇన్సెంటివ్ ఇవ్వాలనీ, రకరకాల పేర్లతో పని చేస్తున్న ఏఎన్ఎంల సేవలను క్రమబద్దీకరించాలంటూ ప్లకార్డులు ప్రదర్శిం చారు. నర్సింగ్ సిబ్బందికి సకాలంలో ఉద్యోగోన్నతులు కల్పించాలనీ, 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. సీఐటీయూ నగర కార్యదర్శి ఎం.వెంకటేష్ అధ్యక్షత వహించిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు, టీయుఎంహెచ్ఇయూ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, రాష్ట్ర కార్యదర్శి ఎస్.హరిశంకర్, సీఐటీయూ రాష్ట్ర నాయకులు
ఎన్.శ్రీరాములు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆకలి, ఆవేదన పెరిగితే సమ్మె తప్పదు :ఎం.సాయిబాబు
అత్యవసర సేవల్లో ఉన్న సిబ్బంది అయినా సరే...ఆకలి, ఆవేదన పెరిగితే సమ్మె బాట పట్టక తప్పదని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబు హెచ్చరించారు. ఎమర్జెన్సీ సేవల్లో ఉన్న వారు నిరసనలు తెలపవద్దని ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వాలు,అంతే వేగంగా సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులు, ప్రజల సమస్యలు చర్చించడం ఇష్టం లేకనే కరోనా కుంటిసాకుతో అసెంబ్లీ సమావేశాలను కుదించారని విమర్శించారు. కరో నా మహమ్మారితో అంత ఇబ్బందిగా ఉంటే గత ఆరు నెలలుగా ఆస్పత్రులులను నిరంతరాయంగా ఎలా తెరిచి ఉంచగలుగుతారని అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజా సేవ మరిచిపోయారనీ, గత ఆరు నెలలుగా వైద్యసిబ్బందితో పాటు జర్నలి స్టులు, పోలీసులు తదితర ఫ్రంట్ లైన్ వర్కర్లే కరోనా నుంచి కాపాడుతున్నారని తెలిపారు. వారియర్లను కడుపులో పెట్టుకుంటానంటూ మాటలు చెప్పిన సీఎం కేసీఆర్ చేతల్లో కాళ్ల కింద వేసి తొక్కేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా రోగ్యం కుక్కలు చింపిన విస్తరిలా తయారైందనిఆవేదన వ్యక్తం చేశారు. సమాజం ఉన్నంత వరకు ప్రజారోగ్యవ్యవస్థ ఉంటుందనీ, అలాంటి చోట తాత్కాలిక పోస్టులెందుకని ప్రశ్నించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినా సరే వైద్యసిబ్బందికి మెరుగైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ బకాయి నిధుల కోసం కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అడిగితే ఆగమేఘాలపై విడుదల చేసే సర్కార్ ఉద్యోగుల డిమాండ్లపై స్పందించడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. వైద్యారోగ్యశాఖలో అన్ని సంఘాలు ఐక్య ఉద్యమానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పర్మినెంట్ చేయాల్సిందే : భూపాల్
కాంట్రాక్టు ఉద్యోగులందరిని పర్మినెంట్ చేయాల్సిందేనని టీయుఎంహెచ్ యూ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. కోర్టు తీర్పు పేరుతో కేవలం వెయిటేజీ కల్పించి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నా లను ఆయన తప్పుపట్టారు. ఏండ్ల తరబడి సేవలు చేసిన కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్దీకరించకుండా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే నిరుద్యోగులతో కేసులు వెయించారని విమర్శించారు. ఇన్నేండ్ల సర్వీసు తర్వాత తిరిగిపరీక్షలు రాయాలనడం సరికాదని హితవు పలికారు. ఇప్పటికైనా పర్మినెంట్ కు ముందుకు రాకపోతేపోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.