Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అగ్రి బిల్లులపై రైతాంగం ఆగ్రహం.. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసనలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/విలేకరులు
భూమికి చెర... రైతుకు ఉరి లాంటి వ్యవసాయ బిల్లును కేంద్రం తక్షణం ఉపసంహరించుకోవాలని రైతాంగం డిమాండ్ చేసింది. పార్లమెంటులో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులతో పాటు ఇతర బిల్లులకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం), ప్రజాసంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. భద్రాద్రి, హైదరాబాద్ జిల్లాల్లో జరిగిన ధర్నాల్లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పాల్గొన్నారు.
దేశంలో ప్రజలంతా కరోనాతో ఇబ్బంది పడుతుంటే.. దాన్నే అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం విద్యుత్, నూతన విద్యా విధానం, వ్యవసాయ చట్టం లాంటి ప్రజావ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ప్రజల జీవితాలను కార్పొరేట్ల చేతిలో పెట్టిందని అన్నారు. వ్యవసాయ బిల్లును నిరసిస్తూ ఈ నెల 25న వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆందోళనలకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ఇచ్చి పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి, కొణిజర్ల, ఏన్కూర్ మండలాల తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించారు. వేంసూరు, మర్లపాడు చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. కూసుమంచిలో ప్లకార్డులతో నిరసన తెలిపారు.
వైరాలో వ్యవసాయ బిల్లు ప్రతులను దహనం చేశారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, సూపరెంటెండెంట్కు వినతిపత్రం ఇచ్చారు. అశ్వారావుపేట సెంటర్లో బిల్లు ప్రతులను దహనం చేశారు. చండ్రుగొండలో పీఎం మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. టేకులపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని కారెమ్మ గుడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ను ముట్టడించి కార్యాలయ పరిపాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో బిల్లు ఆర్డినెన్స్ను దగ్ధం చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్లో తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. తుంగతుర్తి, మునగాలలో నిరసన తెలిపారు. చిలుకూరు, గరిడేపల్లిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాన్ని అందజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.