Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిఎంఆర్ ఇన్ఫ్రా 51% వాటా విక్రయం
- ఒప్పంద విలువ రూ.2,610 కోట్లు
హైదరాబాద్ : కాకినాడ సెజ్ లిమిటెడ్ (కెసెజ్)లోని తమ పూర్తి వాటాను విక్రయించినట్లు జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ శుక్రవారం ప్రకటించింది. ఈ సెజ్ను నిర్వహిస్తున్న తమ సబ్సీడీ కంపెనీ జిఎంఆర్ సెజ్ అండ్ పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్లోని 51 శాతం వాటాను అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ ప్రయివేటు లిమిటెడ్ (ఎఆర్ఐపిఎల్)కు అమ్మేసినట్లు తెలిపింది. ఈ ఒప్పంద విలువ రూ.2,610 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇందులో తొలి దశలో రూ.1,600 కోట్లు అందుకోనున్నట్లు వెల్లడించింది. వచ్చే రెండు, మూడేళ్లలో మిగితా మొత్తం రూ.1,010 కోట్లు పొందనున్నట్లు తెలిపింది.
ఈ ఒప్పందంలో భాగంగా కెసెజ్లో వాటాతో పాటు.. కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్లో కెసెజ్కు గల 100 శాతం వాటాను సైతం అరబిందో రియాల్టీకి బదిలీ చేయనున్నట్లు వెల్లడించింది. జిఎంఆర్ ఇన్ఫ్రా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నౌకాశ్రయ ఆధారిత బహుళ ఉత్పత్తుల స్పెషల్ ఎకనామిక్ జోన్ను ఏర్పాటు చేసింది. ఈ విక్రయ ఒప్పందం రెగ్యూలేటరీ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని ఆ కంపెనీ పేర్కొంది. ఈ వాటా విక్రయంతో రుణాల భారం తగ్గించుకోవాలని జిఎంఆర్ గ్రూపు యోచిస్తుందని సమాచారం. విక్రయ ప్రకటనతో శుక్రవారం బిఎస్ఇలో జిఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ లిమిటెడ్ షేర్ విలువ 11.08 శాతం లాభపడి రూ.23.55 వద్ద ముగిసింది.