Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్షాలను పరిగణనలోకి తీసుకోలేదు : ఎంపీ మల్ల్లిఖార్జునఖర్గే వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు ఏకపక్షమైనవని సీడబ్య్లూసీ సభ్యులు, ఎంపీ మల్లిఖార్జునఖర్గే విమర్శించారు. చట్టసభల్లో 18 రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా, ఆవేవీ పట్టించుకోకుండానే ఆ చట్టాలను ఆమోదించిందని విమర్శించారు. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందన్నారు. రైతులకు, వినియోగదారులకు ఈ చట్టాలు తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయన్నారు. కాంట్రాక్టు వ్యవసాయంలో రైతులు ఉండరనీ, కూలీలు మాత్రమే ఉంటారని చెప్పారు. పంటలను కార్పొరేట్లు, ధనవంతులే కొనుగోలు చేసేలా ఈ చట్టాల రూపకల్పన చేసిందన్నారు. కనీసం కోవిడ్-19 నిబంధనలు కూడా పాటించకుండా హడావుడిగా చట్టం ఆమోదించిందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమం చేపట్టిందన్నారు. శుక్రవారం ఇందిరాభవన్లో ఆపార్టీ నేతలు కె జానారెడ్డి, వి హనుమంతరావు, బోసురాజు, ఎంపీ రేవంత్రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, కుసుమకుమార్, సంపత్ తదితరులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలను మార్చి దేశంలో ప్రయివేటు వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. భారత రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ విధ్వంసం చేసిందని విమర్శించారు. ఈ చట్టాల వల్ల దీర్ఘకాలంలో వ్యవసాయానికి తీవ్రమైన నష్టం జరుగుతున్నదని చెప్పారు.