Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలనీ, నాలుగు నెలల పెండింగ్ జీతాలను చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జెండాలు, ప్లకార్డులు చేతబూని భౌతిక దూరం పాటిస్తూ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. మద్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నా నుద్దేశించి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం రెండవ శ్రేణి పౌరులుగా చూస్తున్నదని విమర్శించారు. తెలగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోర్టులు చెబుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్షను కొసాగిస్తున్నాయని విమర్శించారు. ప్రధాని మోడీ తన మన్కీ బాత్ కార్యక్రమంలో ఏ ఓక్క రోజూ కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల గురించి ప్రస్తావించలేదని అన్నారు. ఆత్మనిర్భర్ భారతంలో ఆత్మగౌరవంతో బతకడానికి కావాల్సిన జీతం ఇవ్వమంటున్నామే తప్ప అంబానీ, అదానీలాగా సంపాదించి కూడ బెట్టడానికి కాదని అన్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షులు జె. వెంకటేష్ మాట్లాడుతూ కరోనా వస్తది పోతది అని పదే పదే చెప్పిన ముఖ్యమంత్రి, కరోనా పేరు చెప్పి అసెంబ్లీని అర్ధాంతరంగా వాయిదా వేశారని విమర్శించారు. జనం సమస్యలపై నిలదీస్తారనీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అసెంబ్లీని ముట్టడిస్తారనే భయంతో పారిపోయారని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను గుండెల్లో పెట్టుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి ఫీల్డ్ అసిస్టెంట్లు, మిషన్ భగీరథ ఉద్యోగులను తొలగించారని విమర్శించారు. ఫెడరేషన్ ఉపాధ్యక్షులు పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యమ్రాలు చెపట్టామనీ, ప్రభుత్వం దిగి రాకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఆరేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు పద్మశ్రీ, కుమార్, సైదులు, జగదీష్, కమర్అలీ, చాగంటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.