Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులను రోడ్డున పడేయొద్దు
- తక్షణం వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలి
- రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన
- కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
- ఎడ్ల బండ్లపై ర్యాలీలు
నవతెలంగాణ- విలేకరులు
''రైతాంగ వ్యతిరేక వ్యవసాయ బిల్లులను తక్షణం రద్దు చేయాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయడానికి వీల్లేదు.. వ్యవసాయాన్ని కార్పొరేట్ల చేతికిచ్చి రైతులను రోడ్డున పడేయొద్దు.. రైతులను వారి సొంత పొలాల్లోనే కూలీలుగా మార్చొద్దు..'' అంటూ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం అఖిలపక్షం, వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. పలుచోట్ల కలెక్టరేట్లలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బిల్లుల ఆర్డినెన్స్ కాపీలను కాల్చేశారు. ప్రధాని మోడీ ఆరు సంవత్సరాలుగా దేశ సంపదను కార్పోరేట్లకు తాకట్టు పెడ్తున్నారని, ఇప్పుడు దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్నీ వారికే అప్పగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద బహిరంగ సభ నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం కార్యకర్తలు కలెక్టరేట్లోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. ధర్నాకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపారు. కేతెపల్లిలో దిష్టిబొమ్మ దహనం చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. పీఏపల్లిలో రాస్తారోకో చేశారు. చిట్యాలలో దిష్టిబొమ్మ దహనం చేశారు. నార్కట్పల్లిలో రాస్తారోకో, నకిరేకల్లో బిల్లు ప్రతులను దహనం చేశారు. చండూరులో ఆర్డినెన్స్ కాపీల దహనం, రాస్తారోకో చేశారు.
యాదాద్రిభువనగిరి కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతు మెడకు ఉరితాడు బిగించుకుని నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. నేరేడుచర్లలో ధర్నా చేశారు. కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. చింతలపాలెంలో అంబేద్కర్ సెంటర్ వద్ద రహదారిని దిగ్బంధించారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని జమ్మిచెట్టు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ట్రాక్టర్స్తో నిరసన ర్యాలీ చేశారు. నారాయణపేట టౌన్లో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ చౌరస్తాలో, నాగర్కర్నూల్ జిల్లాలో ర్యాలీ తీశారు. గద్వాల జిల్లా కేంద్రంలో నిరసన అనంతరం డీఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు.
ఆదిలాబాద్లో కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేపట్టారు. మూడు వ్యవసాయ బిల్లుల ప్రతులను తగలబెట్టారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి ఉద్రిక్తత ఏర్పడింది. నిర్మల్ కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. మంచిర్యాలలో కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట నిరసన అనంతరం వినతిపత్రం అందజేశారు. మెదక్ జిల్లా తూఫ్రాన్-నర్సాపూర్ ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు తెలిపారు. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో ట్రాక్టర్, బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతుకు నష్టం చేసే వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంత్రావు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యులు రాయల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. బిల్లులకు వ్యతిరేకంగా వామపక్షాలు చేస్తున్న పోరాటాల్లో టీఆర్ఎస్ కలిసిరావాలని కోరారు.
భద్రాద్రి జిల్లా భద్రాచలం పట్టణంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. కొత్తగూడెంలో బైక్, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎన్డీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంఎల్ఏ గుమ్మడి నర్సయ్య పాల్గొన్నారు.
ములుగు జిల్లాలో ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లతో ర్యాలీ తీశారు. జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి-163పై రాస్తారోకో నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా, వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తిలో ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వరంగల్ నగరంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నమాల పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి నిరసన ప్రదర్శన చేసి రోడ్డును దిగ్బంధించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండిపై సంకెళ్లు, ఉరితాళ్లు వేసుకుని నేషనల్ హైవే 365పై నిరసన వ్యక్తం చేశారు.