Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిమాండ్ల పరిష్కారానికి వైద్యారోగ్య కమిషనర్ హామీ
- సమ్మెలోకి వెళ్లట్లేదు : ఆశా యూనియన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వారం రోజులుగా ఆశా వర్కర్లు చేస్తున్న పోరాటం ఫలించింది. హైదరాబాద్లోని కోఠి వైద్యారోగ్య శాఖ భవన్లో ఆ శాఖ కమిషనర్ వాకాటి కరుణ తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశా) యూనియన్(సీఐటీయూ అనుబంధం) నేతలతో చర్చలు జరిపారు. ఆశాల డిమాండ్లను పరిష్కరిస్తామనీ, వేతనాల పెంపు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. చర్చల్లో లేవనెత్తిన మెజార్టీ సమస్యల పరిష్కరానికి కమిషనర్ అంగీకరించడంతో ఈ నెల 28,29,30 తేదీల్లో సమ్మెలోకి వెళ్లటం లేదని ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయలక్ష్మి, కె.సునీత ప్రకటించారు. ఈ చర్చల్లో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్, ఆశా యూనియన్ కోశాధికారి సి.లలిత, రాష్ట్ర ఆఫీసు బేరర్లు రాజమణి, నీలాదేవి, కొండా లక్ష్మి, ఝాన్సీ, పద్మ, అమల, సమ్మక్క, సావిత్రి, మంజుల, కాంతమ్మ, యాదమ్మ, సాధన పాల్గొన్నారు. చర్చల అనంతరం జయలక్ష్మి, సునీత మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు బిల్లులతో సంబంధం లేకుండా ఆశాలందరికీ రూ.7,200 నుంచి 7,500 పారితోషికం ఇచ్చేందుకు జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేస్తామనీ, కరోనాతో చనిపోయిన ఆశా వర్కర్లకు రూ.50 లక్షల బీమాను అమలు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఏఎన్ఎమ్లకు ఇచ్చినట్టుగానే స్కూటీలు ఇస్తామనీ, ఏఎన్ఎం నియామకాల్లో ఆశాలకు వెయిటేజీ మార్కులు అమలయ్యేలా చూస్తామని భరోసా ఇచ్చారని చెప్పారు. పీహెచ్సీలలో ఆశాలకు ఒక రెస్ట్ రూమ్ ఏర్పాటు చేస్తామనీ, కరోనా రక్షణ పరికరాలు సరిపడా ఇస్తామని చెప్పారని తెలిపారు. రిజిష్టర్లకు ప్రింట్కు ఆర్డర్ ఇస్తామనీ, పెండింగ్లో ఉన్న సర్వే డబ్బులు, కరోనా ఇన్సెంటివ్ వెంటనే చెల్లించేలా చూస్తామని కమిషనర్ హామీఇచ్చారని చెప్పారు. రెండు జతల యూనిఫామ్స్ త్వరలో ఇస్తామని చెప్పారన్నారు. ఖాళీగా ఉన్న ఆశాల పోస్టుల భర్తీ, రూ. 10 వేల వేతనం, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారని వివరించారు. ఆశాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి మూడు నెలలకోసారి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని కమిషనర్ వాకాటి కరుణ హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాటం చేసిన ఆశా వర్కర్లకు యూనియన్ నేతలు అభినందనలు తెలిపారు. భవిష్యత్లోనూ ఇలాగే ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.