Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయబిల్లు ఆమోదం రాజ్యాంగవిరుద్ధం
- 'మూజువాణ'ి వ్యక్తి నిర్ణయమే : ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
పార్లమెంటులో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని బెన్నెట్ విశ్వవిద్యాలయం రాజ్యాంగ అధ్యా పకులు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ బిల్లులు ఆమోదింపచేసుకోవడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం వ్యవహరించిందనీ, ఎక్కడా రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య కనీస విలువలను కూడా పాటించలేదని విమర్శించారు. సుందరయ్య విజ్ఞానకేంద్రం ఆధ్యర్యంలో కార్యదర్శి ఎస్ వినయకుమార్ అధ్యక్షతన శుక్రవారం 'పార్లమెంటు పరిణామాలు-ప్రజాస్వామ్యం' అంశంపై వెబ్నార్ జరిగింది. దీనిలో మాడభూషి శ్రీధర్ ప్రధాన వక్తగా మాట్లాడారు. వ్యవసాయబిల్లు సహా ఏడు బిల్లుల్ని పార్లమెంటు ఎలాంటి చర్చా లేకుండానే ఏకపక్షంగా ఆమోదింపచేసుకున్నదని చెప్పారు. వాస్తవానికి వాటిలో వ్యవసాయబిల్లు సహా మొత్తం మూడు ఆర్డినెన్స్లను కోవిడ్-19 తీవ్రంగా ఉన్న జూన్ నెలలోనే కేంద్ర తీసుకొచ్చిందని వివరించారు. కోవిడ్ తీవ్ర పరిణామాల నేపథ్యంలో అప్పట్లో దీనిపై చర్చ జరగలేదనీ, వాటినే ఇప్పుడు చట్టరూపంలోకి పార్లమెంటు ద్వారా ఆమోదింపచేసుకుందని గుర్తుచేశారు. అత్యంత విపత్కర పరిస్థితుల్లో దేశప్రజలు ఉంటే ఇలాంటి బిల్లులను అత్యవసరంగా ఆమోదింప చేసుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభలో డిప్యూటీ స్పీకర్ హరివంశ్ మూజువాణి ఓటుతో వ్యవసాయబిల్లును ఆమోదించారని చెప్పారు. మూజువాణి ఓటు అంటేనే స్పీకర్ స్థానంలోని ఓ వ్యక్తి యొక్క వ్యక్తిగత అభిప్రాయమని ఆయన వివరించారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయనీ, అయినా 'మెజారిటీ' పేరుతో కేంద్రం వాటిని పట్టించుకోలేదన్నారు. వ్యవసాయ బిల్లులో రైతులకు వ్యతిరేకంగా అనేక క్లాజులు ఉన్నాయనీ, అవి అమల్లోకి వస్తే సామాన్యులకు తిండిగింజలు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 పేరుతో పార్లమెంటులో తొలివేటు ప్రశ్నోత్తరాలపై పడింద న్నారు. సమాచారహక్కు చట్టం రాకముందు పార్లమెంటు ప్రశ్నోత్తరాల్లోనే పారదర్శకత ఉండేదనీ, కేంద్రం దాన్ని రద్దు చేసి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలు, మీడియాతో పాటు పార్లమెంటులో కూడా మాట్లాడరనీ, వన్ వే ట్రాఫిక్ లాగా మన్కీ బాత్ పేరుతో ఆయన చెప్పేదే వినాల్సి వస్తున్నదని ఆక్షేపించారు. వ్యవసాయ బిల్లు అత్యంత ప్రమాదకర మైందన్నారు. దేశంలో తమ ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించాలని ఏ రైతు...ఏ రైతు సంఘం కూడా కేంద్రాన్ని అడగలేదన్నారు. అలాంటప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం ఈ బిల్లు తెచ్చారని ప్రశ్నించారు. రాజ్యసభ టీవీలో ప్రసారాలు నిలిపివేసి మరీ బిల్లులను ఆమోదించుకున్నారని చెప్పారు. సెలక్ట్ కమిటీ లేదా జాయింట్ సెలక్ట్ కమిటీకి, పార్లమెంటరీ ప్యానల్కు బిల్లును పంపమని ప్రతిపక్షాలు అడిగాయనీ, ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. గతంలో ఆధార్ను మనీ బిల్లుగా పార్లమెంటులో ప్రవేశపెట్టారనీ, దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు స్పీకర్ ఏది మనీ బిల్లుగా భావిస్తే...అదే మనీ బిల్లు అని అభిప్రాయపడ్డారనీ, ఒకే న్యాయమూర్తి అది తప్పు అనీ, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంగా చెప్పారని వివరించారు. బిల్లుపై చర్చను డిమాండ్ చేసిన ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేసి అమానవీయంగా బయటకు లాక్కెళ్లారనీ, ఇది క్రిమినల్ నేరమని అన్నారు. పార్లమెంటులో కండబలం చూపి, చట్టాలు చేసుకొనే దౌర్భాగ్యం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది చీకటిరోజు అని అన్నారు. ''లోక్సభలో అడిగితే మార్షల్స్తో లాగేస్తారు. బయట అడిగితే రాజద్రోహం కేసులు పెడతారు'' ఇది ఎట్టిపరిస్థితుల్లోనూ ఇది ప్రజాస్వా మ్యం కాదని స్పష్టం చేశారు. వ్యవసాయబిల్లులో స్పాన్సర్ అనే మధ్య దళారీ వ్యవస్థను చట్టంగా మార్చి ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని విమర్శించారు.