Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో బార్లు, క్లబ్లు, టూరిజం బార్లు తెరుచుకునేందుకు అనుమ తిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో గత మార్చినెలలో వైన్షాపులతో పాటు బార్లు, క్లబ్లను కూడా మూసేసిన సంగతి తెలిసిందే. తిరిగి ఆరు నెలల తర్వాత తాజాగా బార్లను ఓపెన్చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగల్ ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలకు లోబడి వీటిని అనుమతించినట్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. అయితే బార్లు, క్లబ్లు, టూరిజం బార్లకు నిబంధనలు వర్తిస్తాయని అధికారులు తెలిపారు. బార్లు, క్లబ్లలో ప్రవేశ ద్వారం వద్దనే కస్టమర్లకు థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్లు నిర్వహించాలి. లోపలికి వెళ్లేప్పుడు తప్పనిసరిగా క్యూపద్దతిని పాటించాలి. పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి. పార్కింగ్ లాట్లలో క్రౌడ్ మేనేజ్మెంట్ను అమలుచేయాల్సి ఉంటుంది. ప్రతి టేబుల్ వద్ద హ్యాండ్ శానిటైజర్ను అందుబాటులో ఉంచాలి.
బార్ నిర్వాహకులు, సిబ్బంది కచ్చితంగా మాస్క్లు ధరించాలి. బార్లలో, క్లబ్బుల్లో ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడటం, మ్యూజిక్ కార్యక్రమాలు, డాన్స్ ఫ్లోర్లు ఏర్పాటు చేయడాన్ని నిషేధించారు. కస్టమర్లు వచ్చేముందు ప్రతి బార్లోపల, బయటా ఉదయం, సాయంత్రం వేళల్లో పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేయాలి. అలాగే బార్లలో సరైన వెంటిలేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కాగా వైన్షాపుల వద్ద నిర్వహించే పర్మిట్రూమ్లకు తదుపరి ఆనుమతి ఇచ్చే వరకూ మూసే ఉంచాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.