Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు నెలల కిందట పెద్దలను ఎదిరించి వివాహం
- దంపతులను కిడ్నాప్ చేసిన భార్య బంధువులు
- తప్పించుకున్న భార్య, సంగారెడ్డిలో భర్త దారుణ హత్య
- పోలీసులఅదుపులో 13మంది.. పరారీలో ఒకరు: డీసీపీ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-మియాపూర్ (గచ్చిబౌలి)
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కులదురహంకార హత్య కలకలం రేపు తోంది. తమ ఇంటి అమ్మాయిని ప్రేమ పెండ్లి చేసుకున్నాడని కక్షగట్టిన యువతి కుటుంబీకులు యువకుడిని అతి కిరాత కంగా హత్య చేశారు. కులాలు, అంతస్థుల మధ్య తేడానే హత్యకు కారణ మని మృతుని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచల నం సృష్టించిన ప్రణయ్ హత్య లాగానే ఈ హత్యనూ కిరాయి గూండాలతో చేయించారు. ఈ అమానవీయ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారంరాత్రి జరగ్గా శుక్రవారం వెలుగుజూసింది. మియా పూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్లో నివాసం ఉండే లక్ష్మారెడ్డి స్థానికంగా రేషన్ డీలర్, బిల్డింగ్ మెటీరియల్ సప్లయర్. అతనికి కూతురు, కొడుకు ఉన్నారు. కుమార్తె అవంతి 2018లో బీటెక్ పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెంది న హేమంత్(26) కుటుంబం నగరానికి వలసొచ్చి ఎన్నో ఏండ్లుగా లక్ష్మారెడ్డి ఇంటికి సమీపంలోనే నివాసముంటు న్నారు. 2013లో డిగ్రీ పూర్తి చేసిన హేమంత్ సొంతంగా ఇంటీరి యర్ పనులు చేయిస్తున్నాడు. పక్కపక్కనే ఉండటంతో అవంతి, హేమంత్కు మధ్య ఏర్పడిన పరిచ యం ప్రేమగా మారి ఎనిమిదేండ్లుగా ప్రేమించుకున్నారు. హేమంత్ కుటుంబం వీరి పెండ్లికి అంగీకరించినప్పటికీ లక్ష్మారెడ్డి ఒప్పుకోలేదు. దాంతో గతేడాది నవంబర్ నుంచి అవంతిని ఇంట్లోనే బంధించి పెండ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇంట్లో నుంచి వచ్చేసిన అవంతి, జూన్ 10న స్థానిక బీహెచ్ఈఎల్ సంతోషిమాత ఆలయంలో హేమంత్ను వివాహం చేసుకున్నది. గచ్చిబౌలిలోని టీఎన్జీఓస్ కాలనీలో వారు నివాసముంటున్నారు. పెండ్లయిన తర్వాత అవంతి తరపు కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వస్తుండటంతో పోలీసుల సమక్షంలోనే తల్లిదండ్రులతో రాజీ కుదుర్చుకున్నారు. తనకు కుటుంబసభ్యులకు ఎలాంటి సంబంధమూ లేదని, తన పేరు మీద ఉన్న ఆస్తులన్నింటినీ అవంతి తండ్రి లక్ష్మారెడ్డికి రాసిచ్చేసింది.
పట్టపగలే కిడ్నాప్
అవంతి వేరే సామాజిక తరగతి వ్యక్తిని, ఆస్తిపాస్తులేమీ లేని హేమంత్ను పెండ్లి చేసుకోవడాన్ని లక్ష్మారెడ్డి అవమానంగాభావించి జీర్ణించుకోలేకపోయాడు. దాంతో తమతో ఎలాంటి సంబంధం లేదని రాజీ చేసుకున్నాగానీ కక్ష పెంచుకుని అదును కోసం ఎదురు చూశాడు. గురువారం హేమంత్ను హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేశాడు. అవంతి మేనమామలు విజయేందర్ రెడ్డి, యుగంధర్ రెడ్డితో పాటు 10 మంది కిరాయి గూండాలు కలిసి గురువారం మధ్యాహ్నం సమయంలో మూడు కార్లలో అవంతిఇంటికి వచ్చారు. దంపతులిద్దరినీ బలవంతంగా లాక్కెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఇరువురూ కారులో నుంచి దూకేయగా.. హేమంత్ ని పట్టుకొని కొట్టుకుంటూ కారులోకి ఎక్కించుకుని ఓఆర్ఆర్ వైపు తీసుకెళ్లారు. అవంతి వారి నుంచి తప్పించుకొని అత్తమామలకు, 100 నంబర్కు సమాచారం అందించగా పోలీసులు రంగంలోకి దిగారు.
కిష్టాయగూడెంలో మృతదేహం
ఓఆర్ఆర్ మీదుగా సంగారెడ్డి వెళుతూనే తాడుతో హేమంత్ చేతులు, కాళ్లు కట్టి కారు వెనుక సీట్లో పడేసి చిత్రహింసలు పెట్టారు. కారులోనే తాడుతో గొంతు నులిమి హత్య చేశారు. సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివారులోని చెట్ల పొదల్లో హేమంత్ మృతదేహాన్ని పడేశారు. కాగా, హేమంత్ కిడ్నాప్పై సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు విచారణ చేపట్టారు. హత్య జరిగినట్టు తెలియడంతో గురువారం అర్ధరాత్రి కిష్టాయగూడెం నుంచి హేమంత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని హైదరాబాద్ ఉస్మానియాకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇప్పటికే 13 మందిని అదుపులోకి తీసుకోగా, ఒకరు పరారీలో ఉన్నట్టు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. హేమంత్ను తామే హత్య చేసినట్టు పోలీసుల ముందు అవంతి పుట్టింటి వాళ్లు ఒప్పుకున్నారు. యుగంధర్ రెడ్డి, రంజిత్రెడ్డి, రాకేష్రెడ్డి, సంతోష్రెడ్డి, సందీప్ రెడ్డి, రజిత, స్పందనతో పాటు మరికొందరి పేర్లను రాసి హేమంత్ తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతస్థుల మధ్య తేడానే కారణం..
కేవలం కులం, అంతస్థుల కారణంగానే తన బిడ్డను పొట్టనపెట్టుకున్నారని, ఇష్టం లేకుండా పెండ్లి చేసుకున్న నా కొడుకుని ఓ దెబ్బ కొడతారేమో అనుకున్నా కానీ, ఇలా ప్రాణం తీస్తారని ఊహించలేదని హేమంత్ తల్లిదండ్రు లు కన్నీటిప ర్యంతమయ్యారు. లక్ష్మారెడ్డిది స్థానికంగా మంచి పలుకుబడి ఉన్న కుటుంబం. ఆస్తులు, అంతస్థులు బాగానే ఉన్నాయి. అయితే, హేమంత్ కుటుంబం ఆర్యవైశ్యులు. ఆస్తులు అంతగా లేని మధ్యతరగతి కుటుంబం. హేమంత్ తల్లి బ్యూటీ పార్లర్ నడుపుతోంది. దాంతో తమ తాహతుకు ఏమాత్రం సరిపోని వారితో వియ్యం అందుకోవడాన్ని లక్ష్మారెడ్డి కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోయారు. వారిలోని ఆ భావన హత్యకు దారి తీసింది.
గచ్చిబౌలి పోలీసుల నిర్లక్ష్యమా??
అయితే, తన భర్తను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్తున్న సమ యంలో కారు నుంచి దూకి అత్తారింటికి సమాచారం ఇవ్వ డంతో వాళ్లు పోలీసులకు సమాచారం ఇవ్వగానే సకాలంలో స్పందించి ఉంటే తన భర్త బతికి ఉండేవాడని బాధితురాలు అవంతి ఆవేదనవ్యక్తం చేసింది. తనభర్త చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. తనలాంటి బాధ మరో అమ్మాయికి రావొద్దని బోరున విలపించింది.