Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లంపి చర్మ వ్యాధితో పశువుల మృత్యువాత
- పశువులు, జీవాలకు వైద్యం బహుదూరం
- ఆరు నెలలుగా నిలిచిపోయిన మందుల సరఫరా
- మేత మేస్తూనే కుప్పకూలుతున్న గొర్లు
నవతెలగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వరుస వర్షాలతో సీజనల్ వ్యాధులతోపాటు పశువులకు కొత్త వ్యాధి సోకుతోంది. ఈ వ్యాధితో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఈ లంపి స్కిన్ వ్యాధితో పశువుల శరీరమంతా పుండ్లు పడి వాటి నుంచి రక్తం కారుతోంది. ఒకదాన్నుంచి మరోదానికి వ్యాధి సోకుతుండటంతో రైతులు, కాపరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కొత్త వ్యాధికి ప్రభుత్వ పశుఆస్పత్రుల్లో సరైన మందులు అందుబాటులో లేక రైతులే బయట కొనుక్కుని వేస్తున్నారు. ఒక్కో పశువుకు రెండువేల రూపాయలకుపైగా ఖర్చవుతోంది. మరోవైపు గొర్లకూ వింత వ్యాధులు వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని బండలేమూర్ గ్రామానికి చెందిన బీమనమోని రాములు తన పాలిచ్చే పశువుకు వ్యాధి నివారణ కోసం రూ.1500 ఖర్చు చేశాడు. లంపి స్కిన్ వ్యాధి కూడా రావడంతో రూ.250 పెట్టి మందులు కొనుగోలు చేసి తనే ఇంజక్షన్లు ఇచ్చాడు.
- అదే గ్రామానికి చెందిన మరో రైతు జోగు క్రిష్ణ పశువులకు ఇతర వ్యాధులతో పాటు లంపి చర్మవ్యాధి వచ్చింది. దీంతో ఒక్కోదానికి వెయ్యి రూపాయల వరకు ఖర్చయిందని, అయినా వ్యాధి తగ్గడం లేదని రైతు ఆందోళన చెందుతున్నాడు. వైద్యాధికారులకు ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. దాంతో చేసేది లేక పశువులను విక్రయించాలనుకున్నాడు. అదే గ్రామానికి చెందిన పార్వతి యాదయ్య అనే గొర్రెల కాపరికి 200 జీవాలున్నాయి. ఇతని మందలోని 100జీవాలకు రోగాలు వచ్చాయి. వాటిలో ఇప్పటికే 20 జీవాలు మృత్యువాత పడ్డాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా వైద్యాధికారులు పరిశీలించి, మందులు ఇవ్వలేదు. జిల్లాలో ఆరు నెలలుగా పశు వైద్యశాలలకు మందులు రావడం లేదు. వ్యాధుల నివారణకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో రైతులు బయట కొంటున్నారు. జిల్లాలో 46 పశువైద్యశాలు, మరో 87 గ్రామీణ పశువైద్య కేంద్రాలు, నాలుగు ప్రాంత పశువైద్యశాలలున్నాయి. గ్రామాల వారీగా ఇటీవల నిర్వహించిన సర్వేలో 4,00,039 గోజాతి, గేదెజాతి పశువులు ఉన్నట్టు తేలింది. 6,23,462 గొర్రెలు, 2,44,538 మేకలు, 1,78,09,207 కోళ్లు ఉన్నట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రభుత్వం ఒక్కో పశువైద్యశాలకు రూ.లక్ష విలువైన మందులను మూడు విడతల్లో సరఫరా చేస్తుంది. వాటిలో 60శాతం చిన్న చిన్న వ్యాధులకు సంబంధించిన పౌడర్లు, మందులు ఉంటాయి. 40 శాతం మాత్రమే ఇంజక్షన్లు ఉంటాయి. కానీ, ఈ ఏడాది ఇప్పటి వరకు మందులు సరఫరా కాకపోవడంతో రైతులు దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. తాజాగా పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకడంతో దాని నివారణకు విలువైన మందులు వినియోగించాల్సి వస్తోంది. మందులు, ఇంజక్షన్కు ఒక్కో పశువుకు రూ.2వేలు ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. పశువైద్యశాలల్లో మందులు లేకపోవడంతో వైద్య సిబ్బంది చేతులెత్తేస్తున్నారు.
మృత్యువాత పడుతున్న జీవాలు
వరుసగా కురిసిన వర్షాల కారణంగా గొర్రెలూ రోగాల బారిన పడుతున్నాయి. గడిచిన 20 రోజుల్లో వేల సంఖ్యలో జీవాలు మృత్యువాత పడ్డాయి. మేత మేస్తూనే అకస్మాత్తుగా పడిపోతున్నాయి. ఒకేసారి ఐదారు జీవాలు మృత్యువాత పడుతుండటంతో కాపరులు లబోదిబోమంటున్నారు. ఎండనకా వాననకా వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుండగా.. వింత రోగాలతో జీవాలు మృత్యువాత పడుతుండటంతో కాపరులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమకు తోచిన వైద్యాన్ని జీవాలకు చేస్తున్నారు. మూతిపుండు రోగం వచ్చిన జీవాల మూతులను వేడినీళ్లతో ఉదయం, సాయంత్రం వేళల్లో శుభ్రం చేస్తున్నారు. రాత్రి వేళల్లో ఇంజక్షన్లు వేస్తూ వాటిని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రత్యేక నిధులు మంజూరు
పశువులకు లంపి చర్మవ్యాధి నివారణకు ప్రభుత్వం జిల్లాకు మొదటి దఫా ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. రెండో విడత కోసం ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాం. ఇక జిల్లాకు ప్రతి ఏడాదీ రూ.10లక్షల నిధులు కేటాయిం చాల్సి ఉంటుంది. కానీ మొదటి విడతలో రూ.2.50లక్షలే కేటాయించింది. వీటితో పాటు క్రమంగా వచ్చే మందులు వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. రాగానే మండలాల వారీగా పంపిణీ చేస్తాం. అప్పటి వరకు కాపరులు తగు జాగ్రతలు తీసుకోవాలి. రోగం వచ్చిన పశువులు, జీవాలను వేరుగా పెట్టాలి.
- డాక్టర్ విజయకుమార్ రెడ్డి- జిల్లా పశువైద్యాధికారి