Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాలు ఓర్వలేనితనంతో దుష్ప్రచారం చేస్తున్నాయనీ, వాటిని తిప్పికొట్టాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల్లో ఓటరు నమోదు ఇన్చార్జీలతో శనివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్ పార్టీ శ్రేణులకు పలు అంశాల పైన దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అభివద్ధి, సంక్షేమాలను సమన్వయం చేసుకుంటూ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామన్నారు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విద్యాధికులకు చేర్చే ప్రయత్నం చేయాలన్నారు. ముఖ్యంగా ఉద్యోగాల కల్పనలో ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవాలను ఎండగట్టి వాస్తవాలను ప్రజల్లోకి గణాంకాలతో సహా తీసుకువెళ్లాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లక్ష 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చిందనీ, మరోవైపు టీఎస్ఐపాస్ ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలను కల్పించామన్నారు. వినూత్నమైన సంస్కరణలకు పెద్దపీట వేస్తూ, అందులో భాగంగానే నూతన పంచాయితీరాజ్, మునిసిపల్, రెవెన్యూ చట్టాలను తీసుకు వచ్చామన్నారు. పట్టణ ప్రగతి, పల్లెప్రగతితో అభివద్ధి పథంలో ముందుకు పోతున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులతో పాటు రైతాంగాన్ని బలోపేతం చేసేలా అనేక కార్యక్రమాలను టీఆర్ఎస్ సర్కారు చేపట్టిందన్నారు. రైతుబంధు, రైతుబీమాతో పాటు రైతు పండించిన ప్రతి గింజనూ కొన్ని ప్రభుత్వం తమదేనని గుర్తు చేశారు. ఇప్పటికే చేపట్టిన పలు కార్యక్రమాలతో పాలమూరు పచ్చబడిందనీ, తత్ఫలితంగా వలసలు ఆగాయని చెప్పారు. త్వరలోనే రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు పోతున్నారన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల్లో బలమైన శక్తిగా ఉన్నదనీ, ఇప్పటిదాకా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ తన బలాన్ని చాటుకున్నదని కేటీఆర్ చెప్పారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక వ్యూహంతో పార్టీయంత్రాంగం ముందుకు పోవాలని కోరారు. ఇందులో భాగంగా అర్హత ఉన్న ప్రతి గ్రాడ్యుయేట్ని ఓటరుగా నమోదు చేయించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే ఓటరు నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు అందరూ తొలిరోజే తమ ఓట్లతోపాటు తమ కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేయించాలని కోరారు. దీనికి సంబంధించి ప్రతి కార్యకర్తా అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. తాను కూడా ఒకటవ తేదీన ఓటరుగా నమోదు చేయించుకుంటానని కేటీఆర్ అన్నారు.