Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
- నిందితులను కఠినంగా శిక్షించాలి
- కులాంతర వివాహితుల రక్షణ చట్టం చేయాలి:సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో కులాంతర వివాహం చేసుకున్న హేమంత్ను దారుణంగా హత్యచేయడాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని యువతి తండ్రి లక్ష్మారెడ్డిని తక్షణం అరెస్ట్ చేయాలనీ, సమగ్ర విచారణ చేసి దోషులందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత యువతి కుటుంబసభ్యుల నుంచి బెదరింపులు రావడంలో పోలీసుల సమక్షంలోనే రాజీ ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. అయినా ఆ యువజంటను పక్కాప్లాను ప్రకారం పట్టపగలే కిడ్నాప్ చేసి, అత్యంత కిరాతకంగా కిరాయి గూండాలతో యువతి తండ్రి హేమంత్ను హత్య చేయించాడని గుర్తు చేశారు. హత్య చేసిన కిరాయి గూండాలు మృతదేహాన్ని సంగారెడ్డి శివార్లల్లోని చెట్ల పొదల్లో పడేశారన్నారు. యువతి కారు నుంచి దూకి 100కు డయల్ చేసిందనీ, పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదన్నారు. పోలీసుల వైఫల్యం ఈ ఘటనలో స్పష్టంగా కనపడుతున్నదని చెప్పారు. గతంలో కూడా ప్రణరు హత్య ఇదే తరహాలో జరిగిందనే సంగతిని పోలీస్ శాఖ మరిచిపోయిందా ? అని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో దాదాపు 46 కుల దురహంకార హత్యలు చోటుచేసుకున్నాయని వివరించారు. కులం, అంతస్థుల అంతరాల కారణంగానే ఈ దారుణాలు జరుగుతున్నాయని చెప్పారు. కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మేజర్లయిన యువతీయువకులు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు రాజ్యాంగం కల్పించిన సంగతిని గుర్తుచేశారు. కానీ ఆ హక్కులు కాలరాయబడుతున్నాయన్నారు. తక్షణమే నిందితులను అరెస్ట్చేయాలనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడటంతోపాటు రాష్ట్రంలో కులాంతర వివాహితుల రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వమే బాధ్యత వహించాలి: ఐద్వా
రాష్ట్రంలో జరుగుతున్న కులదురహంకార హత్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. హేమంత్ హత్యను ఖండించింది. దీనికి బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అవంతి, హేమంత్ ఇద్దరూ ఒకరినొకరు అర్థంచేసుకుని ప్రేమించుకున్న నేపథ్యంలో హేమంత్పై కక్షగట్టి యువతి తండ్రి లక్ష్మారెడ్డి హత్యచేయించడం దారుణమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.ఎన్. ఆశాలత, ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మిర్యాలగూడలో జరిగిన ప్రణరు హత్యతోపాటు భువనగిరిలో చోటుచేసుకున్న నరేశ్ హత్య కూడా ఈ కోవలోకే వస్తాయని గుర్తు చేశారు.