Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎటు చూసినా నీరే..
- ఉప్పొంగిన వాగులు.. వంకలు
- కాలువలను తలపించిన రోడ్లు..
- గ్రామాలు, కాలనీలు జలమయం
- గర్భిణులను వాగులు దాటించిన స్థానికులు
నవతెలంగాణ- విలేకరులు
భారీ వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి వాగులు.. వంకలు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. రోడ్లు, లోతట్టు కాలనీలు కాల్వలను తలపిస్తున్నాయి. చెరువులు అలుగుపారుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి వరదలో పడి మృతిచెందాడు. కోళ్లు మృత్యువాతపడ్డాయి. మహబూబ్నగర్ జిల్లాలో వాగుల్లో పలువురు కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. పెద్దపల్లి జిల్లా దిగువ మానేరు నీటితో రైతుల మోటార్లు, పంపుసెట్లు నీట మునిగాయి. సూర్యాపేట జిల్లా గొండ్రియాల, పాలవరం, అనంతగిరి గ్రామాల చెరువులు పొంగిపొర్లి రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. నారాయణగూడెం గ్రామంలోని ఇండ్లల్లో వరద నీరు చేరింది. పత్తి చేలల్లో మోకాళ్లోతు వర్షపు నీరు నిలిచింది. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో తాడ్వాయి - గణపవరం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. కోదాడ పట్టణ పరిధిలోని చెరువుకు గండి పడి సుమారు వంద ఎకరాలకు పైగా వరి పొలం నీట మునిగింది. కూచిపూడి శివారులో వాగు ఉధతంగా ప్రవహిస్తోంది. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెంలో చెట్లు కూలిపోయాయి. హుజూర్నగర్ మండలంలోని బూరుగడ్డలో నల్ల చెరువు అలుగుపోస్తుంది. గోపాలపురం, బూరుగడ్డకు వెళ్లే రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. పంటలు నీట మునిగాయి. బేతవోలు సమీపంలో చెరువుకు గండి పడింది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో రాముడుపాలెంలో కాకర పందిళ్లు నేలకూలాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లోని మోయతుమ్మెద వాగు, బస్వాపూర్ పిల్లి వాగు, పట్టణంలో ఉన్న ఎల్లమ్మ చెరువు, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి, పరిధిలో ఉన్న కూడవెల్లి వాగు, చేర్యాల పరిధిలో ఉన్న తాడూరు వాగు, చేర్యాల పెద్ద చెరువు, తొగుట ఉప్పరి పల్లివాగు, సిద్దిపేట మందపల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చేర్యాల పెద్ద చెరువు మత్తడి దూకుతోంది. నంగునూరు మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరులోకి వరదనీరు చేరుతున్నది. ప్రస్తుతం సింగూరులో 21.552 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది. 13వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామానికి చెందిన యాదిరెడ్డి కోళ్లఫారంలో భారీ వర్షానికి 9500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. వీటి విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని అంచనా. కొందర్గు మండలంలోని వాగులో ఒక వ్యక్తి రోడ్డు దాటుతూ వరదలో కొట్టుకుపోయాడు. కేశంపేట్ మండలంలో వర్షపు నీటిలో పడి 30 ఏండ్ల వ్యక్తి మృతిచెందాడు.
కొట్టుకుపోయిన ఆటో
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. కొత్తకోట దగ్గర సరళాసాగర్ తలుపులు తెరుచుకున్నాయి. మహ బూబ్నగర్, గద్వాల అలంపూర్లో వరదలతో గ్రామా లు, పట్టణాలు జలమయమయ్యాయి. జూరాల గేట్లు తెరిచి కిందికి వదులుతున్నారు. భూత్పూర్ మండలం పోతుల మడుగు-గోపన్నపల్లి మధ్య కాజ్వేపై దాటడానికి ప్రయత్నం చేస్తుండగా నీటి ప్రవాహానికి ఆటో కొట్టుకుపోయింది. ఆటోను ట్రాక్టర్ ద్వారా లాగడానికి ప్రయత్నించే క్రమంలో తాడు తెగటంతో కిలోమీటర్ వరకు కొట్టుకుపోయింది. ఈదుకుంటూ డ్రైవర్ కనిమోని ఊశన్న బయటకు వచ్చాడు.
వాగుల్లో కొట్టుకుపోతుండగా..
నాగర్ కర్నూల్ జిల్లా వెల్డండ మండలం బైరాపుర్లో బైక్పై వెళ్తున్న యువకుడు వాగులో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. కోడేరు మండలం బావాయిపల్లి వద్ద వాగులో బైకుపై వెళ్తున్న భార్యాభర్తలు కొట్టుకుపో తుండగా స్థానికులు కాపాడారు.
దేవరకద్ర మండలం కౌకుంట్ల వాగులో చేపల వేటకు వెళ్లి వాగులో చిక్కుకున్న వెంకటేష్ను గ్రామస్థులు కాపాడారు. ఉట్కూర్ మండలం పడిగిమారి వద్ద చీకటివాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గొర్రెల కాపరి బాలురాజ్ గల్లంతవ్వగా స్థానికులు రక్షించారు.
వాగులు దాటిన గర్భిణులు
వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లే ప్రధాన రహదారులు మునిగిపోయాయి. కర్ణాటకలోని చించోలి తాలూకా ఇరుగుపల్లి గ్రామానికి చెందిన గర్భిణి నిర్మలను ప్రసవం కోసం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వెళ్తున్నారు. తాండూరుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్కటూర్ వాగు పొంగిపొర్లుతుండటంతో అక్కడే వేచి ఉన్నారు. ఆ సమయంలో పురిటి నొప్పులతో ఆమె విలవిల్లాడింది. గమనించిన స్థానికులు ఆమెను చేతులపై ఎత్తుకొని వాగు దాటించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా, బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గీ గ్రామానికి చెందిన గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతుండగా స్ట్రెక్చర్పై పడుకోబెట్టి వాగు దాటించారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం, పారువెల్ల, జంగపల్లి, గుండ్లపల్లి చెరువులతో పాటు కుంటలు పొంగిపొర్లుతున్నాయి. మైలారం చౌరస్తా వద్ద డి8 ఉప కాల్వకు మూడోసారి గండి పడటంతో పత్తి, వరి చేనులు నీట మునిగాయి. చొక్కారావుపల్లి గ్రామం చూట్టూ నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి.
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కంది కట్కూర్కు చెందిన బిగుల్ల కొమురయ్య, బిగుళ్ల మల్లేశం, పెద్ద లింగాపూర్లో ఇండ్లు కూలాయి. డ్రైనేజీలు పొంగి ఇండ్లలోకి నీరు రావడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. బిక్కవాగు ఉధృతంగా ప్రవహించడంతో ఇళ్లంతకుంట నుంచి అనంతారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కందికట్కూర్ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇల్లంతకుంట మండలం సోమారంపేట్ పరిధిలో విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సోమారంపేట్, రేపాక, వెంకట్రావ్పల్లె, గొల్లపల్లి గ్రామాలు శుక్రవారం రాత్రంతా అంధకారంలో ఉండిపోయాయి.
కొట్టుకుపోయిన పంపుసెట్లు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలలో మానేరు పరివాహక ప్రాంతంలో రైతులు అధికంగా బోర్బావుల నీటిపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. దిగువ మానేరు గేట్లు ఎత్తేప్పుడు రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో వాగు ఉధృతంగా ప్రవహించి పైపులు, పంపుసెట్లు, కరెంటు స్టాటర్లు నీటిలో మునిగిపోయాయి. మరికొన్ని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి.