Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టును విన్నవించిన ఏసీబీ
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కోట్లాది రూపాయల అక్రమాస్తులు గడించిన మల్కాజ్గిరి ఏసీపీ వై.నర్సింహ్మారెడ్డిని తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం ఏసీపీ కి చెందిన అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఏపీతో పాటు తెలంగాణాలోని 25 ప్రాంతాలలో మొత్తం 70 కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు బయటపడినట్టు ఏసీబీ ప్రకటించింది. కాగా ఇందులో అనేక మందిని నర్సింహ్మారెడ్డి ముందుజాగ్రత్త చర్యగా బినామీలుగా పెట్టుకున్నాడని కూడా ఏసీబీ దృష్టికి వచ్చింది. దీంతో ఈ బినామీల వ్యవహారాన్ని కూడా తేల్చడంతో పాటు నర్సింహ్మారెడ్డి అక్రమాలకు సంబంధించి ఏసీబీకి అందిన మరి కొన్ని పిటిషన్లు, అక్రమాల చిట్టాలపై విచారణను జరపనున్నదని తెలిసింది. దీంతో ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న నర్సింహ్మారెడ్డిని ఐదు రోజుల పాటు విచారించడానికి అనుమతిని ఇవ్వాలని కోర్టులో కస్టడీ పిటిషన్ను ఏసీబీ అధికారులు దాఖలు చేశారు.