Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేరళలో కరోనా సక్సెస్కు వారే కారణం
- రాష్ట్ర ప్రభుత్వానికి పట్టని నర్సింగ్ ప్రాధాన్యత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనా నియంత్రణలో కేరళ రాష్ట్రం ప్రపంచ ప్రశంసలను అందుకున్నది. ఐక్యరాజ్యసమితి మొదలు అనేక దేశాలు కేరళ మోడల్ను అనుసరించాలంటూ, ఆ రాష్ట్రంలో తీసుకున్న చర్యలను అధ్యయనం చేశారు. తమ పరిస్థితులకు అనుగుణంగా వాటిని అమలు చేసే ప్రయత్నాలు చేశారు. దేశంలో మొదటి కోవిడ్-19 కేసు నమోదైన రాష్ట్రమైన కేరళ ప్రస్తుతం దేశంలోనే కరోనా కట్టడిలో అన్ని రాష్ట్రాల కన్నా ముందున్నది. నివారణ కోసం అవగాహన కల్పించడం, తప్పనిసరైతే ప్రాథమిక స్థాయిలో చికిత్స అందించే ఏర్పాట్లు, ఉన్న సిబ్బందికి తోడు కరోనా సమయంలో అత్యవసరంగా అదనపు సిబ్బందిని నియమించుకోవడం, వైద్య, నర్సింగ్ తదితర వారియర్లకు ప్రోత్సాహకాలను ప్రకటించడంలోనూ ఆదర్శంగా నిలిచింది. కేరళకు ఇంతటి ఖ్యాతి రావడంలో ప్రజారోగ్య వ్యవస్థలో ఉన్న నర్సుల పాత్ర కీలకంగా మారినట్టు తెలుస్తున్నది. అయితే, నర్సింగ్ వ్యవస్థను బలోపేతంలో రాష్ట్రంలో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉన్నది. కేరళలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు 12 ఉండగా, మన రాష్ట్రంలో వాటి సంఖ్య ఆరుకే పరిమితమైంది. కేరళలో విశాలమైన ప్రాంగణాలు, మౌలిక సదుపాయాలు, తగినంత మంది బోధన, బోధనేతర సిబ్బంది శాశ్వత ప్రాతిపదికన పని చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆరింటిలో ఉస్మానియా నర్సింగ్ కాలేజ్ తప్ప మిగతా ఐదింటికి ఇప్పటికీ ఇన్ఛార్జి ప్రిన్సిపాళ్లతోనే నెట్టుకొస్తున్నారు. చివరిసారిగా 2011లో నర్సింగ్ నియామకాలు చేపట్టగా, 2017 వరకు ఆ ఊసే ఎత్తలేదు. తీరా 2017లో నోటిఫికేషన్ ఇచ్చినా న్యాయపరంగా చిక్కులు తలెత్తడంతో పోస్టులు ఇప్పటికీ భర్తీ కాలేదు. రాష్ట్ర విభజన తర్వాత నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుతో పాటు నర్సింగ్ (ఏడీ), నర్సింగ్ (డీడీ) తదితర పోస్టులను భర్తీ చేయలేదు. తాజాగా సృష్టించిన ఒకట్రెండు పోస్టుల్లో నర్సింగ్ ఆఫీసర్లను కాకుండా ఇతరులనూ నియ మించడంపై అసంతృప్తి నెలకొన్నది. ఉస్మానియా హాస్టల్ కూలిపోయే స్థితిలో ఉన్నదనీ, వరంగల్ కాలేజీలో 15 నుంచి 20 మంది విద్యార్థులకు ఒకే వాష్రూం ఉందని ఆందోళన చెందుతున్నా పట్టించుకునే వారు లేరు. ఇతర కాలేజీల్లోనూ హాస్టల్ వసతి, అధ్యాపకుల నియామకం, పక్కా భవనాల కోసం డిమాండ్లు వినిపి స్తూనే ఉన్నాయి. నర్సింగ్ కౌన్సిల్కు ఎన్నికలు నిర్వహించాలనే నిబంధనలున్నా, వాటిని పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.