Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్ విద్యావ్యవస్థను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్కు ఆ సంఘం అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ మంగళవారం పలు సూచనలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీవీ నరసింహారావు చొరవతో కొఠారి కమిషన్ సిఫార్సుల్లో భాగంగా 1969, అక్టోబర్ 25న ఇంటర్ విద్యను 1969-70 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం (5+3+3+4)ను ఏకపక్షంగా తీసుకొచ్చిందని విమర్శించారు. విద్య ఉమ్మడి జాబితాలో ఉందని గుర్తు చేశారు.
విద్యలో రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. నూతన జాతీయ విద్యావిధానం ముసాయిదా ప్రకారం విద్యారంగంలోకి విదేశీ పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. దీంతో విద్యారంగం జాతీయ సంపద నుంచి అంతర్జాతీయ సంపదగా మారి దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. ఇంటర్ విద్యలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు ఎలాంటి హక్కుల్లేకుండా ఏండ్లుగా పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించి ఇంటర్ విద్యను బలోపేతం చేయాలని కోరారు. సిలబస్ మార్చాలనుకుంటే నిపుణులైన విద్యావేత్తలు, సామాజిక ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉన్న మేధావులతో కమిటీని నియమించి క్షేత్రస్థాయి పరిస్థితులు, సాంకేతిక మార్పులు గమనించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు.
పాఠశాల విద్యను మార్చడం ఎందుకు : టీపీఏ
నూతన జాతీయ విద్యావిధానం పేరుతో ప్రస్తుతం 10+2గా ఉన్న పాఠశాల విద్యను 5+3+3+4గా మార్చడం ఎందుకని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) అధ్యక్షులు నాగటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య ప్రశ్నించారు.
ఈ మేరకు వారు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్యాచట్రం 3+8+4గా ఉండాలని సూచించారు. 5+3+3+4 సంక్లిష్ట చట్రంతో పాఠశాల విద్య పనిచేయడం కష్టమని తెలిపారు. హైస్కూల్ 12వ తరగతి వరకు అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను విరమింపచేయాలని సూచించారు.