Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి హయాం నుంచి నేటి దాకా ఉప ఎన్నికల పార్టీగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఆయా ఎన్నికల్లో భారీ మెజారిటీలే లక్ష్యంగా పని చేసుకుంటూ పోవటం దానికి ఆనవాయితీ. అది పార్లమెంటు సీటైనా, అసెంబ్లీ స్థానమైనా... పక్కా ప్లాన్ ప్రకారం... సమావేశాలు, సభలు నిర్వహించటం ద్వారా ఓటర్లను కొన్ని నెలల ముందే కలవటం, వారిని ప్రసన్నం చేసుకోవటం గులాబీ నేతలకు రివాజు. ప్రస్తుతం దుబ్బాక శాసనసభా స్థానం, హైదరాబాద్ నగరంలోనూ ఇదే సీన్ రిపీటవుతున్నది.
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో దుబ్బాకలో ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. నవంబరు 3న అక్కడ ఎలక్షన్ నిర్వహిస్తామంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడటానికి నెల రోజుల ముందు నుంచే గులాబీ పార్టీ తన వ్యూహానికి పదును పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ నియోజకవర్గాలకు మధ్యలో దుబ్బాక ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో అక్కడి ఉప ఎన్నికను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఆ పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్న నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు... ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గాన్ని ఆసాంతం ఒకసారి చుట్టేశారు. అక్కడ లక్ష మెజారిటీ సాధించాలంటూ సీఎం కేసీఆర్ దిశా, నిర్దేశం చేసిన నేపథ్యంలో... అసెంబ్లీ సమావేశాల ముందూ, ఆ తర్వాతా ఆయన అక్కడే మకాం వేశారు. రేయింబవళ్లూ నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతున్నారు. ఇప్పటికే వివిధ కుల, సామాజిక సంఘాల ప్రతినిధులతో పలుమార్లు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఊరూరా తిరుగుతున్నారు.
ఇందుకోసం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ఆయన వేదికగా చేసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమం నుంచి అనుసరిస్తున్న 'తీర్మానాల' వ్యూహాన్ని హరీశ్రావు పక్కాగా అమల్జేస్తున్నారు. గ్రామాలు, మండలాలు, కుల, మత సంఘాల వారీగా 'తామంతా టీఆర్ఎస్ వైపే...' అనే విధంగా తీర్మానాలు చేయిస్తూ ముందుకు పోతున్నారు. తద్వారా ప్రతిపక్ష పార్టీలను డైలమాలో పడేయాలన్నది ఆయన వ్యూహంగా కనబడుతున్నది. జడ్పీటీసీలు, ఎంపీటీసీలను ఇన్ఛార్జిలుగా నియమించటం ద్వారా... క్షేత్రస్థాయిలోని ఏ ఒక్క ఓటూ పక్కకు పోకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎమ్సీ) ఎన్నికలకు సంబంధించి... మంత్రి కేటీఆర్, తనదైన శైలిలో వ్యూహాలకు పదును పెడుతున్నారు. దాదాపు మూడు నాలుగు నెలల నుంచే ఆయన ఈ పనిలో నిమగమైపోయారు. ముఖ్యంగా ఎంఐఎంతో దోస్తీకి సంబంధించి, ఆ పార్టీ నేతలతో వరసగా భేటీలు నిర్వహించటం, హోం మంత్రి మహమూద్ అలీతోపాటు నగరానికి చెందిన ఇతర మంత్రులతో సమాలోచనలు చేయటం, తాజాగా అసెంబ్లీలో హైదరాబాద్ నగర అభివృద్ధిపై చర్చించటం ద్వారా ఇతర పార్టీల కంటే ముందే జీహెచ్ఎమ్సీ ఎన్నికల శంఖారావాన్ని పూరించటంలో ఆయన సఫలీకృతుడయ్యారని చెప్పొచ్చు. టీ హబ్ ద్వారా హైదరాబాద్ నగరానికి ఐటీ కంపెనీలను, టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలను తీసుకొచ్చామంటూ పదే పదే ప్రకటించటం కూడా ఎన్నికల వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
వ్యూహాలతోపాటు సందేహాలు...
దుబ్బాక ఎన్నికల్లో భారీ మెజారిటీని సాధించటం, జీహెచ్ఎమ్సీలో అత్యధిక డివిజన్లను కైవసం చేసుకోవటం ద్వారా... మున్ముందు జరగబోయే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల ఎలక్షన్లను ప్రభావితం చేయాలన్నది టీఆర్ఎస్ వ్యూహంగా కనబడుతున్నది. అయితే ఆ పార్టీ వ్యూహాలు, ప్రణాళికలు బాగానే ఉన్నా... కొన్ని తలనొప్పులు కూడా తప్పేట్టు లేవు. ముఖ్యంగా దుబ్బాకలో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాసరెడ్డి... ఎమ్మెల్యే టిక్కెట్పై గంపెడాశలు పెట్టుకున్నారు. 'సీఎంగారు మా నాన్నకు మాటిచ్చారు. కచ్చితంగా నాకే టిక్కెట్ వచ్చి తీరుతుంది. ముత్యంరెడ్డి ఆశయాలను నెరవేర్చాలంటే ఆయన కొడుకే ఎమ్మెల్యే కావాలని ప్రజలు కోరుకుంటున్నరు...' అంటూ మంగళవారం ఓ ప్రయివేటు ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి దుబ్బాక టిక్కెట్పై శ్రీనివాసరెడ్డి వైఖరేంటో స్పష్టమవుతున్నది ఒకవేళ అధికార పార్టీ టిక్కెట్ నిరాకరిస్తే... ఆయన ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తారనే ప్రచారం కూడా కొనసాగుతుండటం గమనార్హం. కానీ వాస్తవ పరిస్థితి మరో రకంగా ఉంది. సోలిపేట రామలింగారెడ్డి సతీమణి లేదా కుమారుడికే టిక్కెట్ దక్కే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి ఏం చేస్తారనేది వేచి చూడాలి. జీహెచ్ఎమ్సీ విషయానికొస్తే... కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలు, నిరుద్యోగులు, కొలువులు పోయిన ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రయివేటు రంగాల్లో పనిచేసే కార్మికులు, సిబ్బంది అసంతృప్తితో ఉన్నారు. దీనికితోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి వాటిని పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయనే ఆందోళన కూడా టీఆర్ఎస్లో లేకపోలేదు. ఇలాంటి సమస్యలను ట్రబుల్ షూటర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా అధిగమిస్తారనేది వేచి చూడాల్సిన అంశంగా మారింది.