Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో ఎన్ఐఏ రిట్ దాఖలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో నాలుగో నిందితునిగా ఉన్న నలమాస కృష్ణకు నాంపల్లి కోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. దేశ ద్రోహానికి పాల్పడిన కృష్ణకు బెయిల్ ఇవ్వడం వల్ల కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఎన్ఐఏ లాయర్ వాదించారు. నాంపల్లి కోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంది. కృష్ణకు నోటీసులు జారీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతత్వంలోని డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.
బేగంబజార్ జీహెచ్ఎంసీ మరుగుదొడ్లపై పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్లోని బేగంబజార్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ మరుగుదొడ్లకు మరమ్మతులు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అపీల్ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. ప్రజావసరాల నిమిత్తం జీహెచ్ఎంసీ మరుగుదొడ్ల కట్టిందనీ, అయినా 60 ఏళ్ల నాటి వాటిని తీసేయాలంటే మరో చోట కట్టాల్సిందేననీ, అప్పుడు కూడా ఇదే సమస్య వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. బేగంబజార్కు చెందిన మిర్జా సర్ఫరాజ్ బేగ్ దాఖలు చేసిన రిట్ను సింగిల్ జడ్జి కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేశారు. దీనిని కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం కొట్టేస్తూ తీర్పు చెప్పింది.
ఏఐసీటీఈ అనుమతి ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలకు వెబ్కౌన్సిలింగ్లో చేర్చాలి
ఏఐసీటీఈ అనుమతి ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలకు కూడా బుధవారం నుంచి జరిగే రెండో విడత వెబ్ కౌన్సెలింగ్లో చేర్చాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతత్వంలోని డివిజన్ బెంచ్ ఆదేశించింది. కాలేజీలు ఇచ్చే వినతిపత్రాలపై తగిన చర్యలు తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలు కాలేదని కాలేజీలో అప్పీల్ చేశారు. ఏఐసీటీఈ పర్మిషన్ ఉన్న కాలేజీలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో అప్పీళ్లపై విచారణ పూర్తయినట్టు హైకోర్టు ప్రకటించింది.