Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రవాణా శాఖలో నిలిచిన ప్రమోషన్లు
- రాష్ట్రవ్యాప్తంగా 80 ఎంవీఐలు, 14 ఏవో పోస్టులు ఖాళీ
- ప్రమోషన్ల కోసం ఉద్యోగుల ఎదురుచూపులు..!
- రవాణాశాఖకు ఇన్చార్జీలే దిక్కు
- వచ్చే నెలలో గ్రేటర్లో నలుగురు ఏవోలు రిటైర్..?
నవతెలంగాణ-సిటీబ్యూరో
రవాణాశాఖలో ఆరేండ్లుగా ప్రమోషన్లు నిలిచిపోయాయి. ఉద్యోగ విరమణతో కుర్చీలు ఖాళీ అవుతున్నా.. ఆ స్థానాల్లో అర్హత గల వారికి ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చేయకుండా రవాణా శాఖ నాన్చుతోంది. గతేడాది ఐదుగురు ప్రాంతీయ రవాణా అధికారులను డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్లుగా, 16 మంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లను ప్రాంతీయ రవాణా అధికారులుగా ప్రభుత్వం ఉద్యోగోన్నతులు కల్పించింది. అనంతరం అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్సెక్టర్లను.. మోటార్ వెహికల్ ఇన్స్సెక్టర్లుగా ప్రమోషన్లు ఆగిపోయాయి. అందుకు సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేసి నివేదిక తయారు చేశారు. కానీ తొమ్మిది నెలలు గడుస్తునా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఆ ఫైల్ పరిస్థితి ఉంది. దీనిపై డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీ 'డీపీసీ నిర్వహించరు.. ప్రమోషన్లు కల్పించరు' అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో గ్రేటర్తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇన్చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. మరోవైపు అక్టోబర్, నవంబర్ నెలల్లో గ్రేటర్ పరిధిలో నలుగురు పరిపాలనాధికారులు(ఏవోలు), మరో జిల్లాలో ఓ ఆర్టీవో అధికారి రిటైర్ అవుతున్నారని సమాచారం. దాంతో ఉన్నవారిపై అసలు పని భారమంటే.. మరింత ఒత్తిడి పెరగనుంది.
రవాణాశాఖకు మొత్తం 141 మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ప్రస్తుతం 60 మంది పనిచేస్తున్నారు. 81 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉన్నది. ఇందులో ఒక్క గ్రేటర్ పరిధిలోనే 34పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదిలావుంటే రాష్ట్రానికి రవాణాశాఖ ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం గ్రేటర్ హైదరాబాద్ నుంచే వస్తోంది. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల పరిధిలో ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్పేట, బండ్లగూడ, మెహిదీపట్నం, శివారు ప్రాంతాల్లో అత్తాపూర్, ఉప్పల్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీపట్నం ఆర్టీఏ కార్యాలయాలున్నాయి. ప్రస్తుతం వీటిల్లో 34 మందికిగాను 11 మంది ఎంవీఐలే పనిచేస్తున్నారు. ఇక ప్రముఖులు ఎక్కువగా వచ్చే ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్పేట్ ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఒక్క ఎంవీఐ కూడా లేకపోవడం గమనార్హం. టోలిచౌకి, బండ్లగూడ కార్యాలయాలకు కలిపి ఒక్కరే ఎంవీఐ ఉండగా.. ఆయన ఉదయం ఒక చోట, సాయంత్రం మరోచోట విధులు నిర్వహిస్తున్నారు. నిజానికి గ్రేటర్లోని ఈ కార్యాలయ పరిధిలో ప్రతిరోజూ వెయ్యికిపైగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, వెయ్యిలోపు డ్రైవింగ్ లైసెన్స్ల జారీతో పాటు ఇతర సేవలతో ఆర్టీఏ కార్యాలయాలు నిత్యం రద్దీగా ఉంటాయి. దానికితోడు మోటార్ వెహికిల్స్ ఇన్స్పెక్టర్ చేయాల్సిన విధులను అసిస్టెంట్ మోటార్ వెహికిల్స్ ఇన్స్పెక్టర్లతో చేయిస్తున్నారు. దీంతో ప్రస్తుతమున్న సిబ్బందిపైనే పనిభారం పడటంతో పాటు తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు అధికారుల పర్యవేక్షణ లోపించడంతో బ్రోకర్ల ప్రమేయం పెరగడమే కాక, అవినీతి తారాస్థాయికి చేరిందని విమర్శలు వినిపిస్తున్నాయి.
త్వరలో నలుగురు ఏవోలు రిటైర్..!
రవాణాశాఖలో ఆర్టీవోలు, ఏంవీఐలు, ఏఎంవీఐల తర్వాత పరిపాలనాధికారు(ఏవోలు)లే కీలకం. అలాంటిది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీనియారిటీ ప్రకారం ఉద్యోగోన్నతి కల్పించాల్సి ఉన్నా వివిధ కారణాలతో ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. మరోవైపు రిటైర్ అయ్యే వాళ్లు అవుతున్నారు తప్ప ఉన్నవారికి ఉదోగ్యోన్నతి లభించండం లేదు. అక్టోబర్, నవంబర్ నెలలో గ్రేటర్ పరిధిలోని ఖైరతాబాద్, మెహిదీపట్నం, అత్తాపూర్లో పనిచేస్తున్న ఏవోలు ఉద్యోగ విరమణ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే రెండు జిల్లాల్లో ఇద్దరు ఏవోలు రిటైర్ అయ్యారు. పలుచోట్ల సీనియర్ అసిస్టెంట్లే ఏవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవాణాశాఖలో కుర్చీలు ఖాళీ అవుతున్నా.. ఉద్యోగ్నోన్నతులు కల్పించడంలో రవాణాశాఖ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మార్చిలో ఉద్యోగోన్నతులు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఆర్టీసీ సమ్మె, తదనంతరం కోవిడ్-19 కారణంగా ఆలస్యమైందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఏఎంవీలు, ఏవోల ఉద్యోగోన్నతులకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించామని, ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఎప్పుడైనా ఒకే చేయొచ్చని అంటున్నారు. దాని కోసం అర్హత గల ఉద్యోగులు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు.