Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నూతన వ్యవసాయ చట్టాలు' ప్రమాదకరం
- కార్పొరేట్ కంపెనీలకు కమిషన్ ఏజెంటుగా మోడీ:సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
- వర్షాన్ని సైతం లెక్కచేయక కదిలొచ్చిన రైతులు
- ట్రాక్టర్లు, మోటార్సైకిల్స్తో భారీ ర్యాలీ
నవతెలంగాణ-చింతకాని
ప్రధాని మోడీ కార్పొరేట్ కంపెనీలకు కమిషన్ ఏజెంటుగా పనిచేస్తున్నాడని, దానికి నిదర్శనమే కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. రైతుకు ఉరితాడుగా మారిన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా చింతకాని మండలం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ట్రాక్టర్లు, మోటార్సైకిల్స్తో నాగులవంచ మీదుగా చింతకాని మండల కేంద్రం వరకు 15 కిలోమీటర్ల దూరం ట్రాక్టర్ ర్యాలీ, మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాతర్లపాడులో ఈ ర్యాలీని పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ రైతాంగాన్ని తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మార్చి కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చేవిధంగా ఈ బిల్లు ఉందని తెలిపారు. ఈ బిల్లు వల్ల మార్కెట్లలో దళారులు, వ్యాపారులు ప్రవేశించి రైతులను నిలువునా దోపిడీ చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 62 లక్షల కోట్ల వ్యవసాయ వ్యాపారం రాబోయే రోజుల్లో కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లనుందన్నారు. కార్పొరేట్ శక్తులు చెప్పిన పంటల్నే వేసే విధంగా ఉన్న చట్టాలను తొలగించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా, చట్టసభలకు కనీస విలువ కూడా ఇవ్వకుండా రైతు వ్యతిరేక బిల్లులను తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల రక్తాన్ని పీల్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. 200 గజాలలోపు స్థలం ఉన్న పేదలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ను వర్తింపచేయాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని, నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ బిల్లులను రద్దు చేసే వరకు సీపీఐ(ఎం) చేసే పోరాటాల్లో రైతులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కాగా, జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీలకు అతీతంగా రైతులు ర్యాలీలో పాల్గొనడానికి తరలివచ్చారు.