Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కోవిడ్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ప్రజా ప్రతినిధుల వేతనాల్లో కోత విధించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటిని తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. పెన్షనర్లకు రెండు విడతల్లో, ఇతరులకు నాలుగు విడతల్లో వాటిని చెల్లించనున్నారు. ఈ మేరకు బుధవారం ఆర్థికశాఖ జీవోనెం.61ని విడుదల చేసింది. పెన్షనర్లకు సంబంధించి వాయిదా వేసిన మొత్తాన్ని అక్టోబరు, నవంబరులో రెండు విడతలుగా చెల్లించనున్నారు. ఆలిండియా సర్వీసుల్లోని అధికారులతోపాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, గౌరవ వేతనంతో పని చేసే సిబ్బంది, ప్రజా ప్రతినిధులకు అక్టోబరు నుంచి జనవరి-2021 వరకూ నాలుగు విడతలుగా నగదు రూపంలో చెల్లించనున్నారు.
డియర్నెస్ అలవెన్సును విడుదల చేయాలి : టీఎన్జీవో
వేతన బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో... టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకండి ప్రతాప్ ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. దీంతోపాటు బకాయిపడ్డ మూడు డియర్నెస్ అలవెన్సులను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు.