Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టుకు జీహెచ్ఎంసీ నివేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జీహెచ్ఎంసీకి ఉన్న ఆర్థిక వనరులు పరిమితమని, ప్రజాహితం కోసం ఔట్సోర్సింగ్ విధానంలో సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికపై నియమించుకుంటున్నామని, రెగ్యులర్ సిబ్బందితో సమానంగా పనిచేస్తున్నారని చెప్పి వారందరి సర్వీసుల్ని క్రమబద్ధీకరణ చేయడం అసాధ్యమని హైకోర్టుకు నివేదించింది. కాంట్రాక్ట్, తాత్కాలిక సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరించాలని ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ కోరారు. హైకోర్టు గతంలోని ఆదేశాల మేరకు ఆయన పోస్టుల వివరాలు, ఆర్థిక పరిస్థితులతో వివరంగా అదనపు అఫిడవిట్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులు అమలులో ఆచరణ సాధ్యం కాదు. ఔట్సోర్సింగ్ సిబ్బందితో పనిచేసుకునే వెలుసుబాటు ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలోనే జీవోలు వెలువడ్డాయి. ఆదాయంలో మూడొంతులు జీతాలకే సరిపోతోంది. రెగ్యులరైజ్ చేస్తే జీతాలుగా 625 కోట్ల రూపాయలు ఇవ్వాల్సివస్తుంది. అంత ఆదాయం జీహెచ్ఎంసీకి లేదు.ఔట్సోర్సింగ్ విధానమైనా కనీస వేతనాలు ఇస్తున్నాం. శాంక్షన్ పోస్టు పేస్కేల్ కూడా అమలు చేస్తున్నాం. సింగిల్ జడ్జి తీర్పును కొట్టేయండి. అని హైకోర్టును కోరింది. ఈ కేసు విచారణ అక్టోబర్ 9న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వం లోని ధర్మాసనం ముందుకు విచారణకు రానుంది.
ఆన్లైన్ తరగతులకు అనుమతించాలి
కరోనా నేపథ్యంలో విద్యార్థులను ఆన్లైన్ తరగతులకు అనుమతించాలనీ, వార్షిక పరీక్షలకు అనుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ నగరంలోని రెండు ప్రయివేటు స్కూల్స్ను హైకోర్టు ఆదేశించింది. సికింద్రాబాద్ లోని లూయీస్ స్కూల్, బోయినపల్లిలోని సేయింట్ ఆండ్రూస్లను ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వు లకు వ్యతిరేకంగా ఆ స్కూల్స్ ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తున్నాయని దాఖలైన అప్పీళ్లను బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రత్యేక ఫీజులో సగం చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వుల్ని కొట్టేయాలన్న అప్పీళ్లపై విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం అక్టోబర్ 9కి వాయిదా వేసింది.
అగ్రి గోల్డ్ బాధితులను ఆర్థికంగా ఆదుకుంటాం:హైకోర్టుకు తెలిపిన ఆంధ్రప్రదేశ్
ఏపీలోనే 62 శాతం అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నందున ఆ కంపెనీలో డిపాజిట్ చేసి మోసపోయిన వారిని ఆర్థికంగా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసింది. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు ప్రభుత్వం ఇచ్చే నగదు చెల్లింపులకు అనుమతి ఇవ్వాలని ఏపీ ఏజీ శ్రీరామ్ హైకోర్టును అభ్యర్థించారు. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఏపీ బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయింపులు చేసి రూ.263.99 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. దీనిపై భౌతికంగా కేసుల విచారణ చేసేప్పుడు తగిన ఉత్తర్వులు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ప్రకటించింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు రూ.6380 కోట్ల మేరకు వసూలు చేసి తిరిగి చెల్లించలేదనీ, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వేసిన రిట్పై విచారణ నవంబర్ 4కి వాయిదా వేసింది.
ఆహార సరఫరా అధ్వానంగా ఉంటే ఎలా?
గాంధీలో కరోనా బాధితులు ఉన్నారని, నీలోఫర్ తల్లీపిల్లలు వైద్యం పొందుతుంటారని, అలాంటి ఆస్పత్రికి డైట్ (ఆహారం) సరఫరాలో చేసేవి అధ్వాన్నంగా ఉంటే ఎలా? అలాటి కాంట్రాక్టరే కొనసాగించాలంటే ఎలా? కొనసాగింపే జరిగి రోగులకు సమస్య వస్తే అప్పుడు ఏం చెబుతారు? అని కాంట్రాక్టర్ను హైకోర్టు ప్రశ్నలు వేసింది. అందుకే కాంట్రాక్టర్ కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రకటించింది. నీలోఫర్లో తప్పు చేశారని గాంధీలోనూ ఆహార సరఫరా కాంట్రాక్టును రద్దు చేయడం అన్యాయమని కె.సురేష్ తరఫు లాయర్ వాదించడంతో పైవిధంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతత్వంలోని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. కాంట్రాక్టర్ కాసుల కోసం తప్పులు చేస్తున్నాడని, ఆహార సరఫరాలోనూ అదే తీరుగా ఉన్నాడని డాక్టర్ భగవంతరావ్ వేసిన పిల్పై విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది. ఈలోగా కాంట్రాక్టర్ను కొనసాగించేందుకు హైకోర్టు అంగీకరించలేదు.