Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 5800 ఖైదీలలో ఒక్కరికీ సోకని మహమ్మారి
- కొందరు అధికారులు, సిబ్బందికి వైరస్ కాటు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖలకు తన ధాటిని చూపించిన కరోనా వైరస్ రాష్ట్ర జైళ్ల లోని ఖైదీలకు సోకకుండా చూడటంలో ఆ శాఖ అధికారులు సక్సెస్ అయ్యారు. దాదాపు ఏడు నెలల కాలంలో రాష్ట్రాన్ని కరోనా వైరస్ ఒక ఊపు ఊపుతూనే ఉన్నది. కొద్ది మేరకు తగ్గినట్టు కనిపించినా తిరిగి ఏ సమయంలో తన తీవ్రతను చూపుతుందో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. వైద్య శాఖ అధికారులు మాత్రం ఈ వైరస్ కొంత మేరకు తగ్గుముఖం పడుతున్నదని కొంత ఉపశమన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అది పూర్తిగా కనుమరగయ్యేదెన్నడో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకులు వెళ్లదీస్తున్నారు. ఇదిలా ఉంటేరాష్ట్రంలోని కేంద్ర కారాగారాలు మొదలుకుని జిల్లా జైళ్ల వరకు అందులో ఉన్న ఒక్క ఖైదీకి కూడా కరోనా సోకక పోవడం ఆ శాఖ అధికారులు తీసుకుంటున్న ముందు జాగ్త్ర చర్యలకు నిదర్శనంగా చెప్పవచ్చు. చంచల్గూడ కేంద్ర కారాగారం, చంచల్గూడ మహిళా కారాగారం, చర్లపల్లి కేంద్ర కారాగారం, వరంగల్ సెంట్రల్ జైల్ , చర్లపల్లి ఓపెన్ ఏయిర్ జైలు మొదలుకుని జిల్లా జెళ్ల వరకు ఒక్క ఖైదీ కూడా కరోనా రక్కసి బారిన పడలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర జైళ్లలో 5800 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో రెండు వేల మంది వరకు శిక్షలు పడ్డ ఖైదీలు కాగా మిగతా 3800 మంది (అండర్ ట్రయల్) ఖైదీలు ఉన్నారు. విచారణలో ఉన్న వారిలో దాదాపు వంద నుంచి రెండు వందల మంది వరకు ప్రతి రోజు బెయిల్పైన విడుదల కావడమో లేక కోర్టుల ద్వారా జ్యుడీషియల్ రిమాండ్కు తరలించబడ్డ ఖైదీలో ఉంటారు. కాగా గత మార్చి నెల నుంచి కరోనా మహమ్మారి వ్యాప్తి ఆరంభమైనప్పుటి నుంచి అప్రమత్తమైన జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ప్రతి ఖైదీకి కోవిడ్ నిబంధనలను అనుసరించి జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. ప్రతి ఖైదీ జైలులో అడుగు పెట్టగానే శానిటైజ్ చేయడం, మాస్క్లు ధరించడం వంటి చర్యలు చేపట్టారు. అంతేగాక జైళ్లలోని ప్రతి బ్యారక్ను ప్రతి రోజు శానిటైజ్ చేయడం, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచేలా బృందాలు తయారు చేసి బాధ్యతలు అప్పగించడం, ఎక్కడ కూడా గుంపులు చేరకుండా రెండడుగుల దూరం ఉండేలా ప్రతి క్షణం వారిని మైకుల ద్వారా అలర్ట్ చేయడం అధికారులు, సిబ్బంది విధుల్లో భాగమైంది. అంతేగాక వారి భోజనంలో ప్రతి రోజు మాంసం, గుడ్లు , పాలు వంటి పౌష్టిక ఆహారంపైనా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక ఉదయం లేవగానే వ్యాయామం, ప్రాణాయామం, యోగాలు ప్రతి ఖైదీ చేసేలా అధికారులు కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఖైదీకి ఆరోగ్యం చెకప్లు చేయించడం , అనుమానం ఉన్న వారిని క్వారంటైన్ చేయడం , డాక్టర్లతో ఏ చిన్న జ్వరం వచ్చినా చెకప్లు చేయించడం వంటి చర్యలను ఉన్నతాధికారులు తీసుకున్నారు. ఈ విషయంపై జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. అదే సమయంలో కరోనా బారి నుంచి రక్షించడానికి ఉద్దేశించిన మాస్క్లు, శానిటైజర్ల తయారీపై ఖైదీలకు శిక్షణ నిప్పించి భారీ మొత్తంలో వాటి తయారీకి ఉపక్రమించేలా చూశారు. ఇప్పటి వరకు దాదాపు పది లక్షలకు పైగా మాస్క్లు, శానిటైజర్లను తయారు చేయడంలో ఖైదీలు సక్సెస్ అయ్యారు. దీని వలన వారికి జీవన భృతి కూడా భారీగానే కాసులు అందాయి. ఈ సందర్భంగా డీజీపీ రాజీవ్ త్రివేది నవ తెలంగాణతో మాట్లాడుతూ ప్రతి ఒక్క ఖైదీ సహకారంతోటే ఈ చక్కటి పరిణామాలను జైళ్లలో సాధించగలిగామన్నారు. ముఖ్యంగా కరోనా , దాని వలన ఒనగూరే భయంకర నష్టాల గురించి ప్రతి ఒక్క ఖైదీకి అవగాహన చేయడంలో అధికారులు, సిబ్బంది సక్సెస్ అయ్యారని అన్నారు. దీనికి వారు స్పందించిన తీరు కారణంగానే జైళ్లలో ఒక్క ఖైదీకి కూడా ఈ వైరస్ సోకలేదని ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే కొందరు అధికారులు, సిబ ్బందికి ఈ వైరస్ సోకిందనీ, వారిని వెంటనే గుర్తించి హౌం క్వారంటైన్ చేయడం, వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించడం వలన వారు కూడా త్వరగానే కోలుకుని తిరిగి ఉద్యోగాల్లో చేరారని త్రివేది తెలిపారు. కరోనా వైరస్ కారణంగా కొందరు ఖైదీలను పెరోల్పై విడుదల చేయాలని ఆలోచన వచ్చినప్పటికీ తాము తీసుకున్న జాగ్రత్తల వల్ల ఆ పరిస్థితి తలెత్తలేదని ఆయన అన్నారు. కరోనా వైరస్ కనుమరుగయ్యేంత వరకు జైళ్లలో తమ ముందు జాగ్రత్త చర్యలు, కరోనా నిబంధనల అమలు కచ్చితంగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు.