Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 32 మంది నిందితులను ప్రత్యేక సీబీఐ కోర్టు నిర్దోషులుగా తీర్పు ఇవ్వడంతో న్యాయానికి అన్యాయం జరిగిందని ఆవాజ్ రాష్ట్ర కమిటీ పేర్కొంది. న్యాయం అపహాస్యం చేయబడిందని తెలిపింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా సీబీఐ వెంటనే పై కోర్టుకు అప్పీల్కు వెళ్ళాలని ఆవాజ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ, మహమ్మద్ అబ్బాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ తీర్పు కోసం 28 సంవత్సరాల సుదీర్ఘకాలం పట్టిందనీ, ఆలస్యంగా జరిగే న్యాయం అన్యాయంతో సమానం అనేది సాధారణ న్యాయసూత్రమని అభిప్రాయపడ్డారు. ఇంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా న్యాయం మాత్రం జరగలేదని పేర్కొన్నారు. నేరపూరిత చర్యకు మార్గనిర్దేశం చేసి, ఘటనా స్థలానికి హాజరైన బీజేపీ, వీహెచ్పీ, ఆర్ఎస్ఎస్ ఉన్నత అగ్రశ్రేణి నాయకులు అందరూ బాబ్రీ మసీదును కూల్చివేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణల నుంచి నిర్దోషులుగా తేలారని తెలిపారు. ఇది ప్రజలందరినీ విస్మయానికి గురి చేసే సంఘటన అని, భారత లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు పెద్ద సవాలేనని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు 2019 నవంబర్ 8న ఇచ్చిన అయోధ్య తీర్పులో కూల్చివేతను నేరంగా, చట్ట ఉల్లంఘనగా పేర్కొందని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ నేరానికి ప్రధాన సూత్రధారులు, పాత్రధారులు దోషులు కాదని లక్నో కోర్టు కనిపెట్టిందని తెలిపారు. ఈ తీర్పు రాజ్యాంగం ద్వారా పాలించబడుతున్న లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా దేశ ప్రతిష్టకు మాయని మచ్చ అని పేర్కొన్నారు. ప్రజలందరూ దేశంలో లౌకిక, ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాల్సిన అవసరముందనీ, ఈ తీర్పు మరోసారి వెల్లడి చేసిందని వివరించారు. ప్రజలు ఆ దిశగా ఆలోచించాలనీ, సీబీఐ పై కోర్టుకు అప్పీల్కు వెళ్లాలని కోరారు.