Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిందితులను కఠినంగా శిక్షించాలి:సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి జబ్బార్
నవతెలంగాణ - వనపర్తి రూరల్
ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఆదిపైనా, అతని తల్లిదండ్రులపైనా మంగళవారం రాత్రి కొందరు దాడి చేశారని, నిందితులను కఠినంగా శిక్షించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జబ్బార్ డిమాండ్ చేశారు. బుధవారం చిన్నంబావి మండలం గూడెం గ్రామాన్ని ఆయన సందర్శించి ఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంగళవారం రాత్ర ఇంట్లో నిద్రపోతున్న ఆదిపై అదే గ్రామానికి చెందిన కేశవులు, గోవిందు, కురుమయ్య, మూర్తి, జనార్ధన్, కృష్ణమ్మ, వెంకటేష్, జయన్న కర్రలు, రాళ్లతో దాడి చేశారని చెప్పారు. అడ్డుకోబోయిన అతని తల్లిదండ్రులపైనా అకారణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో వారికి తీవ్ర గాయాలయ్యాయని, ఆది తలకు, చేతులకు రక్తస్రావం అయిందని చెప్పారు. అదే రాత్రి స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. మళ్లీ బుధవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన కేశవులు కొడుకు వెంకటేష్, అతని మామ, మిగతా వారంతా కలిసి కర్రలతో దాడి చేశారన్నారు. విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ, మరోపక్క ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడూ అధికారుల దృష్టికి తీసుకెళ్తుండటం వల్లే ఇంతటి దురాగతానికి ఒడిగట్టారన్నారు. రెండుసార్లు దాడి చేశారంటే.. ఆ కుటుంబాన్ని భౌతికంగా ఉండకుండా చేయాలనే కుట్ర చేసినట్టు అర్థమవుతోందన్నారు. ఆ దుండగులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆంజనేయులు, పార్టీ నాయకులు పుట్ట ఆంజనేయులు, మేకల ఆంజనేయులు, బాల్ రెడ్డి, రాజు, కుమార్, బి.కుమార్ ఉన్నారు.