Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాలు మౌనం వీడాలి
- ప్రత్యేక చట్టాల రూపకల్పన జరగాలి:వెబినార్లో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కులదురహంకార ఘటనలపై స్పష్టమైన రాజకీయ దృక్పధం లేనందునే నేరాల సంఖ్య పెరగుతున్నదని జిల్లా సెషన్స్ న్యాయమూర్తి డాక్టర్ జి రాధారాణి అన్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా నేరాలు జరిగినప్పుడు ఏ రాజకీయ నాయకుడూ మాట్లాడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యాలను కూడా గమనించాలని చెప్పారు. కులాన్ని ఓట్బ్యాంకుతో ముడిపెట్టడం వల్లే ఇలంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. కులాంతర వివాహతుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 'కులదురహంకార హత్యలు-నివారణ మార్గాలు' అంశంపై వెబినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అవంతి-హేమంత్, అమృత-ప్రణరు చూడచక్కని జంటలు అని అన్నారు. కిరాయిహంతకులతో సుపారీ మాట్లాడుకొని తల్లిదండ్రులే హత్యలు చేయించడం దారుణమని చెప్పారు. ఈ తరహా నేరాన్ని సమాజం ఆమోదిస్తున్నట్టు అనిపిస్తున్నదనీ, దీనికి కులమే ప్రధాన కారణమని అన్నారు. కులదురహంకారంలో ఆడపిల్లలే ఎక్కువగా అణచివేత, హింసకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కులానికి అంతటి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. కులాంతర వివాహాలపై స్పష్టమైన రాజకీయ దృక్పధం లేదనీ, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏ ఒక్క రాజకీయనాయకుడూ స్పందించకపోవడం విచారకరమనీ, వారిలో అభ్యుదయ భావాలు కలిగిన వాళ్లే లేరా అని ప్రశ్నించారు. వారిలో ఓట్లు పోతాయనే భయమే కనిపిస్తున్నదని చెప్పారు. కులదురహంకార ఘటనలను సుప్రీంకోర్టు ఖండిస్తూనే ఉందనీ, ఉత్తరాదిలోని కాఫ్ పంచాయతీలు నేరాలేనని స్పష్టం చేసిందని తెలిపారు. ఇలాంటి కేసుల సత్వర విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలనీ, బాధితులకు భద్రత కల్పించాలనీ సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఇవి ఏవీ అమల్లోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనల్లో పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తున్నదని చెప్పారు. వ్యక్తిగత స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు అనీ, దాన్ని ఎవరూ అడ్డుకోజాలరనీ స్పష్టం చేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సుందరయ్య విజ్ఞాన కేంద్రం కార్యదర్శి ఎస్ వినయకుమార్ మాట్లాడుతూ ఉత్తరాదిలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగేవనీ, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఇలాంటి కులదురహంకార ఘటనలు దాదాపు 47 వరకు జరిగాయని చెప్పారు.. కులం ప్రధానమై, వ్యక్తి స్వాతంత్య్రం లేకుండా పోయిందన్నారు. మనుస్మృతి కులంతో ఓటు రాజకీయం ముడిపడి ఉందనీ, ఇలాంటి ఘటనలపై పౌరసమాజం స్పందన కూడా చాలా స్వల్పంగా ఉందన్నారు. కొన్ని సామాజిక సంస్థలు, వామపక్షాలు మాత్రమే బాధితులకు అండగా నిలుస్తున్నాయని తెలిపారు.. కులాంతర వివాహాలు చేసుకున్న వారికీ, చేసుకోవాలనుకునే వారికి భద్రత కల్పిస్తూ చట్టాలు తేవాలనే డిమాండ్ చాలాకాలంగా ఉందని చెప్పారు.. కులాంతర వివాహాలు చేసుకుంటే ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలు కూడా నిలిచిపోయాయనీ,. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని అన్నారు. కుల నిర్యూలన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుత్తా జ్యోత్న్స మాట్లాడుతూ హేమంత్ హత్య దుర్మార్గమని చెప్పారు. కులనిర్మూలన సంఘం తరఫున ఘటనాస్థలానికి వెళ్లి పరామర్మించామన్నారు. రాజకీయాలు కులాలను ప్రోత్సహించడం వల్లే ఈ హత్యలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణ భావజాలమే దీనికి కారణమన్నారు. నిచ్చెన్నమెట్ల కులదురహంకారంతో జరిగిన అమృత-ప్రణరు ఉదంతాన్ని చూసామనీ, దానిపై. పెద్ద ఉద్యమమే వచ్చిందని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కూడా కులాంతర వివాహాలు జరగాలని చెప్పారని గుర్తుచేశారు. మేనరికాలు వద్దని ప్రచారం చేస్తున్నామనీ, స్వకుల వివాహాల వల్ల అంగవైకల్యంతో పిల్లలు పుడతారని శాస్త్రవేత్తలు చెప్తున్నారనీ అన్నారు. కులనిర్మూలనకై సమాంతర సమాజ నిర్మాణం జరగాలని తెలిపారు. ఆడపిల్ల హక్కు కాదనీ... స్వేచ్ఛ అని చెప్పారు. కులదురహంకార ఘటనలపై ప్రభుత్వాలు మౌనం వీడాలని డిమాండ్ చేశారు. కులాంతర వివాహితుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు టి స్కైలాబ్బాబు మాట్లాడుతూ కులాంతర వివాహాలపై రాజస్థాన్ అసెంబ్లీలో అక్కడి ప్రభుత్వం ఓ బిల్లును ఏకగ్రీవంగా అమోదించిందని తెలిపారు. ప్రేమ వివాహాల్లో జరుగుతున్నవి పరువు హత్యలు కావనీ, కులదురహంకార హత్యలేనని స్పష్టంచేశారు.