Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డంపింగ్ యార్డులను రాంకీకి అప్పగించొద్దు
- సీఐటీయూ, స్వచ్ఛ ఆటోటిప్పర్ కార్మికసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-అడిక్ మెట్
స్వచ్ఛ ఆటో కార్మికుల పొట్ట కొట్టొదని, జీహెచ్ఎంసీ చెత్త సేకరణను ప్రయివేటు సంస్థ రాంకీకి అప్పజెప్పడాన్ని విరమించుకోవాలని సీఐటీయూ, స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డులను ప్రయివేటు సంస్థలకు అప్పజెప్పడానికి నిరసనగా బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఈశ్వర్రావు, స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్ వీరేశం మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్లో 30 సర్కిళ్లలో మెయిన్ రోడ్లు, షాపుల్లో చెత్త సేకరణను అక్టోబర్ 1 నుంచి ప్రయివేటు సంస్థకు అప్పజెప్పడానికి నిర్వహించే టెండర్లను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డులను రాంకీ వంటి ప్రయివేటు సంస్థలకు అప్పజెప్పడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 25 ఏండ్ల నుంచి చెత్త సేకరణపై
వేలాది మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో పెరుగుతున్న చెత్త ఉత్పత్తిని బట్టి.. దూరం ఉన్న డంపింగ్ల వరకు కార్మికులు రిక్షాలను లాగలేకపోతున్నారని, ఆటో టిప్పర్లను మంజూరు చేసిందన్నారు. ఆ సమయంలోనూ డ్రైవింగ్ లైసెన్స్ లేని వృద్ధులు, ఇతర చాలా మందిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సింది పోయి ప్రతి టిప్పర్కు రూ.లక్ష వసూలు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వెంకటేష్, నాయకులు మహేందర్, కోశాధికారి వాణి, సూరన్న, రామాంజనేయులు, ఆటో రిక్షా కార్మికులు పాల్గొన్నారు.