Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతదేహంతో పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా
- నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో ఘటన
నవతెలంగాణ -నల్లగొండ: పోలీసుల దెబ్బలకు తాళలేక మహిళా మృతిచెందిందంటూ కుటుంబీకులు, గ్రామస్థులు మృతదేహంలో పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ ఘటన శనివారం నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలంలో జరిగింది. మృతురాలి కుమారుడు సైదా తెలిపిన వివరాల ప్రకారం.. ఉల్సాయపాలెం గ్రామానికి చెందిన కేతావత్ గాజా భార్య సక్రి(50). ఈ నెల 16న సాయంత్రం సక్రి సారా తయారు చేస్తుందన్న సమాచారంతో ఎస్ఐ నాగుల్ మీరా వారింటికెళ్లారు. గుడుంబా తయారీ మానేస్తే పింఛన్ ఇప్పిస్తానని సక్రికి చెప్పి.. పోలీసు జీపు ఎక్కించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీటీసీ కేంద్రానికి తీసుకెళ్లారు. విచారణ సందర్భంగా లాఠీలతో కొట్టారు. అదేరాత్రి 8గంటల సమయంలో సక్రిని తిరిగి ఇంటి వద్ద వదిలిపెట్టారు. పోలీసులు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకపోతున్నానని కుటుంబసభ్యులకు చెప్పి ఏడ్చింది. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏమీ తినలేదు, నీళ్లు తాగలేదు. ఈ క్రమంలో శనివారం సక్రి మృతిచెందింది. పోలీసులు కొట్టిన దెబ్బలకు తమ తల్లి మృతిచెందిందని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబసభ్యులు అడవిదేవులపల్లి పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘటనా స్థలానికి వచ్చిన డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ రమేశ్ మాట్లాడుతూ.. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియాస్పత్రికి తరలించారు. సైదా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శంకర్నాయక్ డిమాండ్ చేశారు.
ఉద్దేశపూర్వకంగానే తీసుకెళ్లి కొట్టారు : సైదా
శుక్రవారం ఉదయం 8:00గంటలకు ఎస్ఐ నాగుల్ మీరా చక్రి ఇంటి వద్దకు వచ్చారు. పింఛన్ ఇప్పిస్తా అంటూ నమ్మించి నలగొండ డీటీసీకి తీసుకెళ్లాడు. విచారణ పేరుతో తీవ్రంగా కొట్టారు. నా తల్లిపై గతంలో ఎటువంటి నాటుసారా కేసులు లేకపోయినా ఉద్దేశపూర్వకంగానే తీసుకెళ్లారు. మా అమ్మ మృతికి ఎస్ఐ బాధ్యుడు. అతనిపై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలి.