Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజాంసాగర్ పరీవాహక రైతుల రాస్తారోకో
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్
సింగూర్ నీటితో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయనీ, నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు మళ్లీ ఆందోళన చేపట్టారు. శనివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బోధన్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతులు బైటాయించారు. గంటన్నర పాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సుభాష్రెడ్డి మాట్లాడుతూ.. సింగూరు ప్రాజెక్టు నీటి ముంపుతో మంజీర పరివాహక ప్రాంత గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారన్నారు. గురువారం నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి వేయగా కొంతమేర పంట నీటిలో నుంచి తేలిందని, తిరిగి శనివారం ఉదయం నుంచి సింగూరు నీటి ప్రవాహంతో మళ్లీ నీట మునిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ రాజయ్య అక్కడికి చేరుకుని నిజాంసాగర్ ప్రాజెక్టు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నామని తెలపడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు బొల్లు నరసింహారెడ్డి, ఎంపీపీ దివిటి రాజు దాస్, మాజీ జెడ్పీటీసీ జయరాజ్, నాయకులు బోయిని బాలయ్య, గంపల వెంకయ్య, క్రిష్టాఫర్, రాజిరెడ్డి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.