Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంట నగరాల్లో మళ్లీ భారీ వర్షం
- బండ్లగూడలో 10.2సెం.మీ వర్షపాతం
- జలదిగ్బంధంలోనే మహానగరం
- ట్రాఫిక్..విద్యుత్ కు తీవ్ర అంతరాయం
- చెరువుగట్ల దగ్గరి కాలనీల్లో బిక్కుబిక్కుమంటూ...
- విద్యుద్ఘాతంతో వ్యక్తి మృతి
హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం కురవటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల రికార్డు స్థాయి వర్షాలకు జంటనగరాల్లో జలప్రళయం సృష్టించాక..ఇపుడు చినుకు పడితేనే జనం ఉలిక్కిపడుతున్నారు. శనివారం సాయంత్రం ఎడతెరిపిలేకుండా పలుచోట్ల కురిసిన భారీ వర్షంతో అవస్థలు పడుతున్నారు. జలదిగ్బంధం నుంచి తేరుకోలేని పలు కాలనీలు మళ్లీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మురుగునీరు ఉధృతంగా ప్రవహించటంతో.. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు మరో వాయుగుండం ముప్పు పొంచిఉన్నదని వాతావరణశాఖ ప్రకటనతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారీ వర్షాలు, వరదలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రాంతాలు, సర్వం కోల్పోయిన జనం ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటుండగా.. మళ్లీ భారీ వర్షం పిడుగులా వచ్చింది. హైదరాబాద్లో శనివారం సాయంత్రం నుంచి వర్షం దంచికొడుతున్నది. దీంతో నగరవాసులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. రోడ్లు, కాలనీల్లో వరద పారుతోంది. ఉప్పల్ మండలంలోని బండ్లగూడలో 10.2సెం.మీ వర్షపాతం నమోదైంది. ఉప్పల్, మేడిపల్లి, సరూర్నగర్, అబ్దుల్లాపూర్మెట్, అల్కాపురి, మారుతీనగర్, సైదాబాద్, సంతోష్నగర్, హబ్సీగుడ, బార్కాస్, హయత్నగర్, హస్తినాపురం, వనస్థలిపురం, షేక్పేట్, గండిపేట్, చార్మినార్, మలక్పేట్, ముషీరాబాద్, అంబర్పేట్, ఉస్మానియా యూనివర్సిటీ, రాజేంద్రనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, నాచారం ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్ ప్రాంతంలో కిలోమీటర్లమేర ట్రాఫిక్ స్తంభించింది. పలు మార్గాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. చెరువు తీర ప్రాంతాల్లోనూ జనం అకాల వర్షాలకు బెంబెలెత్తుతున్నారు. ఎక్కడ చెరువు కట్టలు తెగిపోతాయోనన్న భయం వెంటాడుతున్నది. ఒక్కరోజు వర్షం ఆగిందని ఊపిరి పీల్చుకున్న జనానికి శనివారం మళ్లీ విరుచుకుపడింది. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
ఓల్డ్ మలక్పేట్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. మలక్పేట్ యశోద ఆస్పత్రి చౌరస్తా నుంచి శంకర్నగర్లోని తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యలో భారీ వర్షం వచ్చింది. ఈ క్రమంలో ఫుట్పాత్ నుంచి నడుస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి తగిలాడు. దాంతో కరెంట్ షాక్తో అక్కడికక్కడే ప్రాణం కోల్పోయాడు. మృతుడు శ్రీకాళం జిల్లాకు చెందిన రాములు(40)గా గుర్తించారు. చాదర్ఘట్ పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
కోలుకోకముందే..
వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సుమారు 1000ప్రాంతాలు, కాలనీలు, బస్తీలు, 20వేలకుపైగా ఇండ్ల వరదల్లో చిక్కుకున్నాయి. సుమారు 2లక్షలకు పైగా ప్రజలను జీహెచ్ఎంసీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉప్పల్, ఎల్బీనగర్, బార్కాస్, అంబర్పేట్, చార్మినార్ ప్రాంతాల్లో ఇండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పడవల్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరదనీరు ఇండ్లలోకి చేరడంతో విలువైన సామాగ్రి, టీవీలు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలు కోల్పోయారు.
ఇండ్ల లెక్కింపు
భారీ వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సుమారు 20వేలకుపైగా ఇండ్లు దెబ్బతిన్నాయని అధికారులు లెక్కలేశారు. దెబ్బతిన్న ఇండ్లను పూర్తిస్థాయిలో గుర్తించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఇండ్లతోపాటు కోల్పోయిన ఆస్తుల వివరాలను సైతం లెక్కించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
ముసురుతున్న రోగాలు
కరోనాతో తీవ్ర ఇబ్బందులెదుర్కొన్న నగరవాసులను వరదలు, భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. వర్షంతో ముంపు ప్రాంతాల్లో బురద పేరుకుపోయింది. దీంతోపాటు నాలాల్లోంచి నీరు, రసాయనాలు రావడంతో ప్రజలు రోగాల బారినపడే అవకాశముందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నారు.
రైల్వే బ్రిడ్జి మధ్యలో ఆరడుగుల గొయ్యి
ఫలక్నుమా రైల్వే బ్రిడ్జిపై భారీ ప్రమాదం తప్పింది. బ్రిడ్జి మధ్యలో ఒక్కసారిగా ఆరడుగుల గొయ్యి ఏర్పడింది. అటు కింద నుంచి వెళ్లే రైలు పట్టాలపై వరద నీరు పోటెత్తడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే రైళ్ల రాకపోకలు నిలిపేశారు. బ్రిడ్జి పై వాహనాలు అనుమతించకుండా పోలీసులు కట్టుదిట్టం చేశారు.
వచ్చే ఐదు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అక్టోబర్ 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందనీ, అది బలపడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. హైదరాబాద్లో కుమ్యులోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం సాయంత్రం చిరుజల్లులతో ప్రారంభమై క్రమేణా భారీ వర్షంగా మారింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఈశాన్య అరేబియా సముద్రం ప్రాంతాలలో కొనసాగుతోన్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి క్రమంగా బలహీనపడుతున్నది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురువొచ్చు. ముఖ్యంగా ఈ నెల 20, 21 తేదీల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శనివారం నాడు మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం సింగపూర్ టౌన్షిప్లో అత్యధికంగా 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత శాయిక్పేట(హైదరాబాద్)లో 12.6 సెంటీమీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బండ్లగూడలో 11.9 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లిలో 11.5 సెంటీమీటర్ల వాన పడింది.
ఏరియా వర్షపాతం(సెం.మీ)
బండ్లగుడ 10.2
సరూర్నగర్ 9.3
అబ్దుల్లాపూర్మెట్ 9.1
పెద్దఅంబర్పేట్ 8.9
అల్కాపురి 8.2
కందికల్గేట్ 7.9
ఉప్పల్ 7.2
ఫీర్జాదిగుడ 7
ఎల్బీనగర్ 6.8