Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు
- రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ కుట్ర
- సోషలిజంతోనే ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- కమ్యూనిస్టు పార్టీ వందేండ్ల ప్రస్థానంపై ఆన్లైన్లో బహిరంగసభ
- ప్రజానీకానికి బీజేపీనే శత్రువు : తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణకు గర్వపడే విప్లవ చరిత్ర ఉన్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో అందరం కలిసి ప్రజా ఉద్యమాలను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శనివారం 'కమ్యూనిస్టు పార్టీ వందేండ్ల ప్రస్థానం (1920-2020)'అనే అంశంపై ఆన్లైన్లో బహిరంగ సభను నిర్వహించింది. ప్రధాన వక్తగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడి వందేండ్లు అవుతున్నదని వివరించారు. ఈ కాలంలో అనేక విజయాలు, అపజయాలు, త్యాగాలు, గొప్ప అనుభవాలున్నాయని చెప్పారు. నాడు బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని అంగీకరించలేదనీ, నిర్బంధం విధించిందనీ గుర్తు చేశారు. అయినా స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించామని వివరించారు. నిర్బంధాన్ని తట్టుకుని ప్రజలను ప్రభావితం చేశామని చెప్పారు. మతానికి, రాజ్యానికి, రాజ్యాంగానికి, ప్రభుత్వానికి సంబంధం ఉండొద్దన్నదే లౌకికతత్వమని అన్నారు. మతం వ్యక్తి విశ్వాసానికి సంబంధించిన అంశమనీ, ప్రభుత్వ
జోక్యం ఉండొద్దని చెప్పారు. మతాన్ని, రాజకీయాలను వేర్వేరుగా చూడాలన్నారు. దేశానికి రాజకీయ స్వాతంత్య్రం వచ్చిందని వ్యాఖ్యానించారు. అయితే ప్రజలకు ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం ఇంకా రాలేదని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సమానత్వం రావాలంటే భూసంస్కరణలు అమలు చేయాలని అది సోషలిజంతోనే సాధ్యమని కమ్యూనిస్టు పార్టీ వివరించిందని గుర్తు చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు కావాలన్న డిమాండ్ను ముందుకు తేవడంతో ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత వివిధ రాష్ట్రాలు ఏర్పడేందుకు దోహదపడిందని వివరించారు. రాజ్యాంగానికి పునాది అయిన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయం కోసం కమ్యూనిస్టులు ఎంతో కృషి చేశారని చెప్పారు. సామాజిక, ఆర్థిక రంగంలో స్వాతంత్య్రం రాకపోతే రాజకీయ స్వాతంత్య్రం స్థిరంగా ఉండబోదని అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగానికి పునాదులైన ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజం, సామాజిక న్యాయంపై దాడులు చేస్తున్నదని అన్నారు. హిందూత్వ దేశంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ముస్లింమైనార్టీలు, దళితులు, గిరిజనులు, మహిళలపై హింస, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ కేంద్రం చేతిలోనే అధికారం ఉండేలా చర్యలు తీసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నా నూతన విద్యావిధానం, వ్యవసాయ చట్టాలను ఏకపక్షంగా తీసుకొచ్చిందన్నారు. దోపిడీకి గురైన ప్రజలను ఐక్యం చేసి ప్రజా ఉద్యమాలను నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో సోషలిజం వైపు వెళ్లాలని అన్నారు.
ప్రజలకు బీజేపీ పెద్దశత్రువు : తమ్మినేని
కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతానికి కట్టుబడి ఉందని అధ్యక్షత వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్లలో కమ్యూనిస్టు పార్టీ బలం తగ్గినా సైద్ధాంతిక నిబద్ధతతో ముందుకు సాగుతున్నదని అభిప్రాయపడ్డారు. 2020ని కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు జరపాలని తమ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిందన్నారు. ఈనెల 11 నుంచి 17 వరకు వారోత్సవాల్లో భాగంగా శనివారం బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. బీజేపీ ప్రజలకు పెద్ద శత్రువుగా ఉన్నదని విమర్శించారు. బీజేపీ భావజాలాన్ని అడుగడుగునా అడ్డుకుంటూ ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరముందన్నారు. గతంలో బీజేపీని సమర్థించే వైఖరిని టీఆర్ఎస్ తీసుకున్నదని గుర్తు చేశారు. కానీ ఈ మధ్య ఆ పార్టీల మధ్య వైరుధ్యం పెరుగుతున్నదని వివరించారు. వ్యవసాయ చట్టాలు, జీఎస్టీ బకాయిలు, విద్యుత్ బిల్లు, ఎన్నార్సీ, సీఏఏ వంటివాటితోపాటు రాష్ట్రాల హక్కుల విషయంలో బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ గట్టిగా మాట్లాడుతున్నారని అన్నారు. అయితే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడ తామని చెప్పారు. అయితే బీజేపీని వ్యతిరేకించే అంశాలను సమర్థిస్తామనీ, అది దేశానికి, ప్రజలకు మంచిదని అన్నారు. ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకిస్తామనీ, ఎస్సీ,ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవడాన్ని ప్రతిఘటిస్తామని అన్నారు. కులదురంహకార హత్యలు జరుగుతున్నా సీఎం, మంత్రులకు చీమ కుట్టినట్టు లేదన్నారు. వాటిని ఎందుకు అదుపు చేయ డం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు పీఆర్సీ, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడం లేదని చెప్పారు. దుబ్బాక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ను ఓడించాలని ప్రజలకు, పట్టభద్రులకు పిలుపునిచ్చారు.
మహిళా స్వేచ్ఛా, బానిసత్వ విముక్తి కమ్యూనిస్టులతోనే సాధ్యం : బృందా
ఏండ్లుగా స్వేచ్ఛను కోల్పోయి జీవిస్తున్న మహిళలను కట్టుబాట్ల బంధనాలు, బానిసత్వం నుంచి విముక్తి కల్పించింది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు, రాజ్యసభ మాజీ సభ్యురాలు బృందా కరత్ అన్నారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మహిళలను ఉద్యమంలోకి తీసుకురావడంలో కమ్యూనిస్టులే కీలక పాత్ర పోషించారన్నారు. రైతు కూలీ సంఘాలు, కిసాన్ మహాసభ ఏర్పాటు చేసి మహిళలకు సమాన పనికి సమాన వేతనం వంటి డిమాండ్లను తెరపైకి తెచ్చినట్టు గుర్తు చేశారు. భూమి లేని రైతులకు భూ పంపిణీ చేయాలనీ, పనికి తగిన వేతనం ఇవ్వాలనీ, పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత వంటి అంశాల రాజకీయ ఎజెండాతో కమ్యూనిస్టులు ఉద్యమం చేశారని చెప్పారు. దాంతోనే మహిళలు పోరాటాల్లోకి వచ్చేందుకు సుముఖత చూపినట్టు చెప్పారు. ఆ విధంగానే గోదావరి పులేకరి అనే ఉద్యమకారిణి వర్లీ పోరాటంలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని బృందా గుర్తుచేశారు. అనంతరం లింగ అసమానతలపై అభ్యుదయ ఉద్యమాలు సైతం జరిగాయన్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణలో మల్లు స్వరాజ్యం కమ్యూనిస్టు కార్యకర్త నుంచి పార్టీ నాయకురాలి స్థాయికి ఎదిగారన్నారు. సీపీఐ(ఎం) ఆవిర్భావంలోనూ సమాజం లో మహిళల పాత్రపై విస్తత చర్చ జరిగినట్టు చెప్పారు. మహిళలకు సంబంధించిన ఎన్నో అంశాలపై పోరాటం చేయాలని తీర్మానించుకున్నట్టు వివరించారు. బెంగాల్, త్రిపురలో లెఫ్టఫ్రంట్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మహిళలు, పురుషులకు సమానంగా భూ పట్టాల పంపిణీ చేసినట్టు చెప్పారు. దాంతో చాలావరకు మహిళల జీవితాల్లో మార్పులు చోటుచేసుకున్నాయనీ, మహిళా సాధి కారత జరిగేందుకు ఆ విధానం ఎంతగానో తోడ్పడిం దన్నారు. భూస్వామ్య, బుర్జువా వ్యవస్థల నుంచి విముక్తి పొందేందుకు ఎంతోమంది మహిళా కామ్రేడ్స్ వారి ప్రాణా లను కూడా తృణప్రాయంగా వొదిలినట్టు బృందా కరత్ నెమరు వేసుకున్నారు.వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని తాము ముందుకు వెళతామని ఆమె స్పష్టం చేశారు.
కుల నిర్మూలన నినాదం కమ్యూనిస్టులదే : బివి రాఘవులు
స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కుల నిర్మూలన నినాదం ఇచ్చింది తొలుత కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు బివి రాఘవులు చెప్పారు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన మహాత్మాగాంధీ సైతం అంటరానితనంపై పోరాటం చేసినప్పటికీ, వర్ణ వ్యవస్థ... కుల వ్యవస్థకు వంత పాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత రాజ్యంగ రూపకర్త అంబేద్కర్ కుల నిర్మూలన నినాదానికి మద్దతు ఇచ్చినప్పటికీ ఆయన సూచించిన రిజర్వేషన్లు, రిప్రజేంటేషన్, రిలిజియన్ కన్వర్టిజం (ఆర్ఆర్ఆర్ (3ఆర్) నినాదం) పూర్తి స్థాయిలో కుల నిర్మూలనకు దోహదం చేయలేకపోయిందన్నారు. అంబేద్కరిస్టులుగా చెప్పుకునే కొంతమంది మేధావులు నేటికీ పాలక వర్గాలు ఇస్తున్న చిన్నపాటి అవసరాలు, ప్రయోజనాలు పొందుతూ కుల నిర్మూలనపై దృష్టి సారించడం లేదన్నారు. ఇక అధికార బీజేపీ దాని సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్ ఎన్నడూ కుల నిర్మూలన, అంటరానితనం గురించి యోచన చేసిన పరిస్థితే లేదన్నారు. నాటి నుంచి నేటి వరకు ఏ సంఘ సంస్కరణ ఉద్యమంలోనూ ఆయా సంస్థలు భాగస్వామ్యం కాలేదన్నారు. ఆ సమయంలోనే ఉమ్మడి ఏపీలో సుందరయ్య, కేరళలో నంబూద్రిపాద్, ఏకే గోపాలన్, తమిళనాడులో రామమూర్తి, బెంగాల్లో జ్యోతిబసు, మహారాష్ట్రలో బిటి రణదివే వంటి వారు కుల నిర్మూలనకి కృషి చేసినట్టు చెప్పారు. కులాంతర వివాహలు పెద్ద ఎత్తున జరిగేందుకు కృషి చేశారన్నారు. ఇంతటి ఉద్యమాలు జరిగినా కులం వ్యవస్థ అంతంకాకపోగా మరింత ఘనీభవించిందన్నారు. దానికి కారణం పెట్టుబడే ఈ వ్యవస్థలోని కుల అసమానతలను పెంచి పోషిస్తున్నదని అన్నారు. వ్యవస్థలోని అసమానతలు, పెట్టుబడిపై ఏకకాలంలో కమ్యూనిస్టులు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అసలైన ప్రత్యామ్నాయం వామపక్షమే :మాణిక్ సర్కార్, త్రిపుర మాజీ సీఎం
దేశానికి స్వాతంత్య్రం సిద్దించినప్పటి నుంచి నేటి వరకు రాజకీయాల్లో వామపక్ష పార్టీలు మాత్రమే ప్రత్యామ్నాయ విధానాలతో ముందుకు వస్తున్నాయని త్రిపుర మాజీ సీఎం, సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యుడు మాణిక్ సర్కార్ వెల్లడించారు. అధికార బీజేపీ, కాంగ్రెస్ ఇతర జాతీయ, ప్రాంతీయ బుర్జువా పార్టీలు కేవలం ఒకరికొకరు పోటిదారులు మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయా పార్టీల మధ్య ఎన్నికల క్షేత్రంలోనే పోటీ ఉంటుందని... భావజాలపరంగా, విధానాల పరంగా పెద్దగా తేడాలు ఉండవన్నారు. బుర్జువా పార్టీల నినాదాలు, విధానాల మధ్య తేడాలు ఏమీ ఉండవన్నారు. చాలావరకు ఆయా పార్టీల మధ్య నిర్ణయాల్లో కూడా సారూప్యత ఉంటుందని సర్కార్ గుర్తు చేశారు. అందుకే, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కమ్యూనిస్టులే దేశ రాజకీయ వ్యవస్థకి ప్రత్యామ్నాయమని నొక్కి చెప్పారు. ఇదే స్ఫూర్తితో తాము ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు.