Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాదాబైనామా మార్గదర్శకాలు జారీ
- పట్టణాలైనా గ్రామీణ స్వభావమున్న ప్రాంతాల్లో అవకాశం
- ఐదెకరాల దాకా ఉచితం
- ఆపై దాటితే స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిందే
- తెలంగాణ భూమి హక్కులు పట్టాదార్ పాసుపుస్తకం చట్టం-1971 ప్రకారమే
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సాదాబైనామాలను రెగ్యులరైజేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వీటి ద్వారా కొనుగోలు చేసిన రైతుల భూములను క్రమబద్దీకరణ చేయనున్నట్టు ప్రకటించింది. జూన్ 2, 2014 వరకు రైతులు కాగితంపై రాయించుకుని కొనుగోలు చేసిన భూములకు మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తించనున్నాయి. అదే సందర్భంలో సాదాబైనామాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఐదెకరాల లోపు భూములున్న రైతులకే ఉచితంగా వర్తించనున్నది. ఐదెకరాలు దాటితే స్టాంప్డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు తప్పనిసరిగా చెల్లించాలి. హెచ్ఎమ్డీఏ, కుడా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో వర్తించదు. కానీ, కుడా, హెచ్ఎమ్డీఏలలో గ్రామీణ స్వభావం కలిగిన కొన్ని ప్రాంతాలతో పాటు 2016, 2017లలో రెవెన్యూ శాఖ వెసులుబాటు కల్పించిన గ్రామాల్లోనూ సర్కారు వీటికి అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లో మీసేవాలో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్కార్డు, సాదాబైనామా కాపీలతో పాటు అమ్మినవారి, కొన్నవారి పట్టాదారు పాసుపుస్తకం నెంబర్(ఉంటేనే) వేయాలి. లేనిపక్షంలో భూమి కొన్నట్టు ఇతర డాక్యుమెంట్లు, ఇంకా ఏమైనా రుజువులుంటే దరఖాస్తుతో జమచేయాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో ఫీజు చెల్లించినట్టు మీసేవ కేంద్రం నుంచి రశీదులు తప్పనిసరిగా పొందాలి. కలెక్టర్లు వ్యక్తిగతంగా దృష్టిసారించి సాదాబైనామాల ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలనీ, గ్రామాల్లో విసృత్తంగా ప్రచారం చేయంచాలని సూచించింది. అన్ని గ్రామాల్లోనూ సాదాబైనామాల ద్వారా జరిగిన లావాదేవీలను అధికారులు క్రమబద్దీకరించ నున్నారు. అట్లాగే పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని అనుమతున్న మండలాలనూ ప్రకటించింది. ఆ జాబితాలో రంగారెడ్డి జిల్లాలోని ఫరూక్నగర్, కందుకూరు, కొత్తూరు, యాచారం(పార్ట్) మండలాలున్నాయి. ఫరూక్నగర్ మండలంలో అలీసాబ్గూడ, బుచ్చిగూడ, దుస్కల్, ఎల్కట్ట, కొండన్నగూడ, మొగలిగిద్ద, సూరారంగూడ, రంగసముద్రం, వెలిగర్ల గ్రామాలతోపాటు యాచారం మండల కేంద్రంలోనూ అను మతి ఉంది. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలంలోని అక్వాంచగూడ, బోర్పట్ల, చందాపూర్, చింతల్చెరువు, దౌల్తాబాద్, సిద్దిపేట జిల్లాలోని మర్కూక్ మండలంలోని దామరకుంట, కరకపట్ల, మర్కూక్, పాము లపర్తి ఆ జాబితాలో ఉన్నాయి. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్, నర్సాపూర్, శివంపేట్, తూప్రాన్ మండలాలు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్, ఘట్కేసర్, కీసర, మేడ్చల్ మండలాలున్నాయి. సంగారెడ్డి జిల్లాలో హత్నూర్(పార్ట్), జిన్నారం, కంది, సంగారెడ్డి ఉన్నాయి. సిద్ధిపేట జిల్లాలో మర్కూర్(పార్ట్), ములుగు, వర్గల్ ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీబీనగర్, బొమ్మలరామారం, భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి మండలాలున్నాయి.
ధరణి వెబ్సైట్లో పొందుపర్చకముందే పట్టాలు చేయాలి: సారంపల్లి మల్లారెడ్డి ఏఐకేఎస్
రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన సాదాబైనామాల మార్గదర్శకాలు, సీఎం ప్రకటనలకు పొంతన లేదు. 2014 జూన్ రెండో తేదీ వరకు సాదాబైనామాల ద్వారా జరిగిన లావాదేవీలను క్రమబద్ధీకరిస్తామనీ, రిజిస్ట్రేషన్ ఫీజులు లేకుండా ఈ పనిచేస్తామని సీఎం కేసీఆర్ గతంలో పలుమార్లు ప్రకటించారు. సీఎం ప్రకటనతో రైతులు ఆశపడి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటిదాకా సుమారు 2 లక్షల దరఖాస్తులకు మాత్రమే పట్టాలు చేశారు. ఇంకా 11లక్షల దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండిం గ్లో ఉన్నాయి. వాటన్నింటినీ ధరణి వెబ్సైట్ ప్రారంభించకముందే వాటికి పట్టాలివ్వాలి. ఐదెకరాలలోపు వారికి మాత్రమే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని కండిషన్ పెట్టడం సరిగాదు. మొత్తం దరఖాస్తులకు సాదాబైనామాలకు రిజిస్ట్రేషన్ చేసి ధరణి వెబ్సైట్లో పట్టాదారులుగా నమోదు చేయాలి. గతంలో ఇచ్చిన 2.5 లక్షల పాసు పుస్తకాలలో తప్పులు దొర్లాయి.