Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ నిర్లక్ష్యంతో బీమాకు నోచుకోని రైతులు
- ధర్నాలు, నిరసనలు, దీక్షలకు టీడీపీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారీ వర్షాలతో రైతులు పంట నష్టపోతున్నా...హైదరాబాద్ లోని ప్రజలు ఆస్తి, ప్రాణ నష్టానికి గురవుతున్నా టీఆర్ఎస్ సర్కారులో చలనం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ విమర్శించారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో వరదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ జాతీయ కమిటీ, పొలిట్ బ్యూరో కమిటీ, ఇరు రాష్ట్రాల కమిటీలు, తెలంగాణ రాష్ట్ర సమన్వయ కమిటీని ప్రకటించిన చంద్రబాబుకు సమావేశం ధన్యవాదాలు తెలిపింది. అనంతరం మీడియా సమావేశంలో రమణ మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వ యంత్రాంగం కనీస ధైర్యం కల్పించలేకపోయిందన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యంతో రైతులకు బీమా రాకపోగా, కేంద్రం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకాన్ని అన్వయించుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు చిలువేరు కాశీనాథ్, తిరునగరి జ్యోత్స్న, జక్కిలి ఐలయ్య యాదవ్, అజ్మీరా రాజునాయక్, మహ్మద్ ఆరీఫ్, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు అశోక్ పాల్గొన్నారు.