Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రభుత్వ వ్యవస్థలను పాలకులు నిర్వీర్యం చేసిన ఫలితంగానే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని మారుతి అనాధ ఆశ్రమంలో 14 ఏళ్ల బాలిక మతి చెందిందనే రిట్లో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్ నగరానికి చెందిన న్యాయవాది మమతా రఘువీర్ ఆచంట రాసిన లేఖను హైకోర్టు సుమోటో రిట్గా పరిగణించి న్యాయమూర్తి జస్టిస్ నవీన్రావు విచారణ చేశారు. ప్రతివాదులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, హోం శాఖ కార్యదర్శి, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల కార్యదర్శి, న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి, జువైనల్ జస్టిస్ సభ్య కార్యదర్శి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా సంక్షేమ అధికారులు తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. చట్ట నిబంధనల ప్రకారం ప్రభుత్వం జిల్లా స్థాయిలో బాలల సంక్షేమ కమిటీలు, జువైనల్ జస్టిస్ కమిటీలను ఏర్పాటు చేయలేదని, దీంతో అమీన్పూర్ వంటి ఘటనలు జరిగితే వాటిపై ఆ కమిటీలు చట్ట ప్రకారం సమీక్షించి చర్యలు తీసుకునే అవకాశం లేకుండా ప్రభుత్వం చేసిందని లేఖలో పేర్కొన్నారు. దీంతో అలాంటి కేసులు పెరిగిపోతున్నాయని, వెంటనే ఆ కమిటీల నియామకాలకు ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. బాలికల హక్కులకు రక్షణంగా ఉండాల్సిన కమిటీలు లేనందున వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని, ఫలితంగా పోలీసులు, ఇతర అధికారుల చర్యలు నామమాత్రంగా ఉన్నాయని, దీంతో అమీన్పూర్ వంటి ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీలను ప్రభుత్వం నామమాత్రం చేసిందని, దీంతో ఆ వ్యవస్థలు నీరుగారిపోయాయని అన్నారు. ప్రభుత్వం ఆ కమిటీలను ఏర్పాటు చేయాలని తీర్పు చెప్పాలని, ఆ కమిటీల పనితీరును జిల్లా జడ్జీలు సమీక్ష చేయాలని, హైకోర్టు పర్యవేక్షణ చేస్తే బాలలకు మేలు చేయాలన్న చట్టంలోని స్ఫూర్తి నిలుస్తుందన్నారు.
22 నుంచి హైకోర్టుకు సెలవులు
రాష్ట్ర హైకోర్టుకు ఈ నెల 22 నుంచి 29 వరకూ దసరా సెలవులు. ఈ సమయంలో అత్యవసర కేసులను ఈ నెల 23న దాఖలు చేసుకుంటే వాటిని 28న వెకేషన్ కోర్టులు విచారిస్తాయి. న్యాయమూర్తులు జస్టిస్ పి.నవీన్రావు, జస్టిస్ బి.విజరుసేన్రెడ్డిల ద్విసభ్య ధర్మాసనం, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి ఏకసభ్య ధర్మాసనం విచారిస్తాయని ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఉస్మానియాలోకి వరదనీరు రాకుండా చూడాలి
వరద నీరు ఉస్మానియా ఆస్పత్రిలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతత్వంలోని డివిజన్ బెంచ్ సూచించింది. మూసీ నదిలోకి నీరు వెళ్లిపోయేలా చూడాలని, అడ్డంకులు లేకుండా చేస్తే ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు లేకుండా చేసినట్టు అవుతుందని అభిప్రాయపడింది.
శ్రీనివాస్గాంధీని సీబీఐ విచారణ చేయొచ్చు
మేడ్చల్లో ఎస్పీ స్థాయి అధికారిగా పనిచేస్తున్న శ్రీనివాస్ గాంధీపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయొచ్చునని, అయితే నవంబర్ 4 వరకూ అరెస్ట్ చేయొద్దని సోమవారం జస్టిస్ కె.లక్ష్మణ్ ఉత్తర్వులు జారీ చేశారు. జీఎస్టీ కమిషనర్కు మాత్రమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఉందని, అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నేరుగా సీబీఐ విచారణకు ఆదేశించడం సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకమని గాంధీ హైకోర్టును ఆశ్రయించారు.